Wednesday, July 05, 2017

నిషేధం వల్ల మద్యం వాడకం ఆగిపోతుందా-




నిషేధం వల్ల మద్యం వాడకం ఆగిపోతుందా-

           ఏదీ పూర్తిగా చెడ్డది కాదు కదా. మద్యపానమూ కొన్ని కొన్ని పరిస్థితులలో మేలు చేస్తుంది. వ్యక్తి రోజూ మైళ్ళకొద్దీ నడిచి ఖాళీ సీసాలు, డబ్బాలు పోగుచేసి వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చే సరికి అతను పూర్తిగా అలసిపోయేవాడు. ఆ రాత్రి నిద్ర పోవాలన్నా, మరుసటి రోజు మళ్ళీ పనికి పోవాలన్నా మద్యం తాగక తప్పదు. మద్యపానం అతనికి ఉపశమనాన్ని ఇస్తుంది. పనిచేయగల శక్తినీ సమకూరుస్తుంది. మద్య నిషేధం వల్ల ఇటువంటి వ్యక్తుల చిక్కులు, కష్టాలు మరింతగా అధికమవుతాయి మరి.

            మరింత ముఖ్యమైన విషయమేమిటంటే మద్య నిషేధం ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ విజయవంతమవ్వలేదు. మద్యపానాన్ని అదుపు చేయడంలో మద్యనిషేధం విఫలమయిందని అన్ని దేశాల చరిత్రలూ ఘోషిస్తున్నాయి. 1920ల్లో అమెరికాలో మద్యనిషేధాన్ని అమలుపరిచారు. మద్యం మాఫియాలు పెచ్చరిల్లిపోవడానికి తప్ప ఇది ఎటువంటి సత్ఫలితాన్ని సాధించలేదు. మద్యం సరఫరా యథావిధిగా కొనసాగింది కాకపోతే రహస్యంగా. 1933లో మధ్యనిషేధాన్ని ఎత్తివేశారు.
       గతంలో మద్యనిషేదం రోజుల్లో ఒక లారీ అతను దారి మధ్యలో పలు చోట్ల లారీని ఆపి టైర్‌ ట్యూబ్‌లలో మద్యాన్ని నింపుకోవడాన్ని గమనించాను. అది దొంగ సారా. అక్రమ సారా తాగి మరణిస్తున్న వారు పెద్ద సంఖ్యలో వుండడాన్ని బట్టి దొంగ సారా ఎంత జోరుగా సరఫరా అవుతుందో అర్థం చేసుకోవచ్చు.
        బంగారం దిగుమతులను నిషేధించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలలాంటివే మద్యనిషేధం అమలు చర్యలు కూడా. బంగారం దిగుమతులను నిషేధించడం వల్ల ఆ దిగుమతులు ఆగిపోలేదు. పైగా బంగారం స్మగ్లింగ్‌ పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వం విధిలేక బంగారాన్ని చట్ట బద్ధంగా దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది. ఈ వాస్తవాలు చెప్పుతున్నదేమిటి? మద్యాన్ని చట్టబద్ధంగా నిషేధించలేమనే కాదూ?
           రాష్ట్ర ప్రభుత్వాల రాబడిలో 20 శాతం మద్యం విక్రయాల వల్లే లభిస్తుంది. మద్య నిషేధం వల్ల కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికై  ప్రభుత్వం పన్నులు పెంచాలి. నిషేధం వల్ల మద్యం వాడకం ఆగిపోతుందా. ఆగిపోదని దేశ దేశాల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. నిషేధాన్ని విధించిన తరువాత పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసుకొనే సొమ్మును అధికారులు ‘మామూళ్ళ’ గా వసూలు చేసుకొంటున్నారు. దీనికి పన్నులు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు లోనవుతున్నారు. 
మద్య నిషేధం వల్ల ప్రతికూల ఫలితాలు మాత్రమే సిద్ధిస్తాయి. మద్యపాన ప్రియుడు అధిక ధరకు మద్యాన్ని, అదీ అక్రమంగా కొనుక్కోవలసి వస్తుంది. మద్య పానంతో ఉపశమనం పొందే వ్యక్తులు, తమకు కావలసిన ఉపశమనాన్ని కోల్పోతున్నారు. ధరలు పెరిగిపోవడం వల్ల సగటు వినియోగదారుపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాబడిని కోల్పోతోంది. కేవలం మాఫియాలు, అధికారులు మాత్రమే లబ్ధిని పొందుతున్నారు. మద్యపానానికి దూరంగా వుండాలని ప్రజలకు నచ్చచెప్పడానికి ప్రభుత్వం సామాజిక జాగృతి ఉద్యమాన్ని నిర్వహించడమే అసంఖ్యాక కుటుంబాలను అతలాకుతలం చేస్తున్న తాగుడు దురలవాటు నిర్మూలనకు సరైన మార్గాంతరం. ఎయిడ్స్‌, గర్భస్థ ఆడ శిశువుల హత్యల వంటి దురాచారాలను అరికట్టడంలో సామాజిక జాగృతి కార్యక్రమాలు సాధించిన సత్ఫలితాలు మద్యపానం సమస్య విషయంలో ప్రభుత్వానికి స్ఫూర్తి కావాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card