Showing posts with label NO INTEREST. Show all posts
Showing posts with label NO INTEREST. Show all posts

Thursday, June 11, 2015

ఉన్నత విద్యకు ఆర్థిక ప్రోత్సాహం





ప్రభుత్వఫీజురీయింబర్స్‌మెంట్ పథకం
 
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించే క్రమంలో అత్యంత ప్రధానమైనది ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు అందజేస్తారు. ఇంటర్మీడియెట్ నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని కోర్సులకు ఈ పథకం అందుబాటులో ఉంది. ఆయా కోర్సులు, కమ్యూనిటీ, కుటుంబ వార్షిక ఆదాయ పరిమితికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాల మేరకు ఫీజు రీయింబర్స్ చేస్తారు. విద్యార్థుల స్థానికత ఆధారంగా రీయింబర్స్‌మెంట్ పొందొచ్చు. బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి దాదాపు గతేడాది మాదిరిగానే ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ విధి విధానాలు ఉంటాయని ఎంసెట్-2015 ఫలితాల వెల్లడి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. తెలంగాణలోనూ ఈ ఏడాది కూడా గత విధానాన్నే అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గతేడాది నిర్దేశించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హతలు, విధి విధానాల వివరాలు..

 
ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం:
 
ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) 2013-14 నుంచి 2015-16 బ్లాక్ పిరియడ్‌కు ఇంజనీరింగ్ కళాశాలలకు వాటి ప్రమాణాల ఆధారంగా వేర్వేరు మొత్తాల్లో ఫీజులు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో కనిష్టంగా రూ. 30 వేల నుంచి గరిష్టంగా 1.13 లక్షల వరకు ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కళాశాలలకు లభించింది. అయితే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సీలింగ్ విధించింది. గరిష్టంగా సంవత్సరానికి రూ. 35 వేలు రీయింబర్స్‌మెంట్ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. అదే విధంగా బీఫార్మసీ కోర్సుకు రూ. 31 వేలు గరిష్ట పరిమితిగా పేర్కొంది.సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంవత్సరానికి రూ. 20 వేలు. వీటితోపాటు మరికొన్ని నిబంధనలు విధించింది. అవి..

 
ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థుల కుటుంబ వార్షికాదాయ పరిమితి రెండు లక్షల్లోపు ఉండాలి.బీసీ, ఓబీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉండాలి.కమ్యూనిటితో సంబంధం లేకుండా పది వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థులందరూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందొచ్చు గతేడాది గరిష్ట వయోపరిమితి నిబంధన కూడా అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 29 సంవత్సరాలు; ఓసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు 25 సంవత్సరాలుగా పేర్కొన్నారు.ఈ ఏడాది కూడా దాదాపు ఇవే నిబంధనలు అమలు కానున్నట్లు అధికార వర్గాల సమాచారం.

 
స్థానికత నిర్ధారణ ఇలా..
 
సీట్ల కేటాయింపు, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న లోకల్ (స్థానికత) నిర్ధారణకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలు.. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంతో కలిపి అంతకుముందు నాలుగేళ్లపాటు ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. ఉదాహరణకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం వరకు ఎస్వీయూ రీజియన్‌లో చదివితే.. ఎస్వీయూ రీజియన్‌కు లోకల్ అభ్యర్థి అవుతారు. అదే విధంగా ఏయూ రీజియన్‌లో చదివితే.. ఏయూ రీజియన్‌కు లోకల్ అభ్యర్థి అవుతారు.

 
ఒక వేళ అభ్యర్థులు వేర్వేరు ప్రాంతాల్లో తమ విద్యాభ్యాసం సాగిస్తే (బ్రేక్ అప్ ఆఫ్ స్టడీ) ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం నుంచి గడిచిన ఏడేళ్ల కాలంలో చదివిన ప్రాంతాలను గుర్తించి ఎక్కువ కాలం చదివిన ప్రాంతానికి లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. అదే విధంగా మూడు రీజియన్లలోనూ చదివుండి అందులో రెండు రీజియనల్లలో సమాన కాలం చదినట్లయితే ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ప్రాంతానికే లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. ఉదాహరణకు పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ రెండేళ్లు (మొత్తం మూడేళ్లు) ఏయూ రీజియన్‌లో, ఏడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు(మొత్తం మూడేళ్లు) ఓయూ రీజియన్‌లో,ఆరో తరగతి (ఒక సంవత్సరం) ఎస్వీయూ రీజియన్‌లో చదివితే..

 
ఇంటర్మీడియెట్, పదో తరగతి పూర్తి చేసిన ప్రాంతమైన ఏయూ రీజియన్‌కు లోకల్‌గా పరిగణిస్తారు.అదే విధంగా బ్రేక్ అప్ ఆఫ్ స్టడీ ఇయర్స్‌కు సంబంధించి మొత్తం ఏడేళ్ల కాలంలో మొదటి మూడున్నరేళ్లు ఒక రీజియన్‌లో, మరో  మూడున్నరేళ్లు ఇంకో రీజియన్‌లో చదివితే ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన రీజియన్‌కు లోకల్ అభ్యర్థులవుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమైన పత్రాలు(ఏపీ)కుల ధ్రువీకరణ పత్రం  కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం (జనవరి 1, 2015 తర్వాత జారీ చేసిన)

 
బ్యాంకు రుణాలు.. మరో మార్గం
 
బీటెక్ ఔత్సాహికులకు కోర్సు వ్యయాలు భరించేందుకు అందుబాటులో ఉన్న మరో అవకాశం.. బ్యాంకు రుణాలు. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ విద్యా రుణాలు అందజేస్తున్నాయి. ట్యూషన్ ఫీజు, బుక్స్, కంప్యూటర్ కొనుగోలు, స్టడీ టూర్స్ వంటి మొత్తాలకు సరిపడే విధంగా రుణాలు అందిస్తున్నాయి. వీటిని పొందేందుకు కొన్ని విధి విధానాలు అమలవుతున్నాయి. అవి..

 
భారతదేశంలో చదవడానికి గరిష్టంగా రూ. పది లక్షలు అందిస్తారు (కోర్సు మొత్తం)
 
రూ. నాలుగు లక్షల రుణం వరకు ఎలాంటి మార్జిన్ ఉండదు. రుణ మొత్తం రూ. నాలుగు లక్షలు దాటితే 5 శాతం (భారతదేశంలో) మార్జిన్ చెల్లించాలి.రూ. నాలుగు లక్షల రుణం వరకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. తల్లిదండ్రుల హామీ సరిపోతుంది.రూ. నాలుగు లక్షల నుంచి రూ. ఏడున్నర లక్షల వరకు తల్లిదండ్రుల హామీతోపాటు థర్డ్‌పార్టీ కొల్లేటరల్ సెక్యూరిటీ చూపించాలి. రూ. ఏడున్నర లక్షల కంటే ఎక్కువ మొత్తం రుణం కావాలంటే తల్లిదండ్రుల హామీతోపాటు స్థిరాస్థిని కొల్లేటరల్ సెక్యూరిటీగా చూపించాలి.ఈ నిబంధనలు పాటిస్తే నామమాత్రపు వడ్డీతో రుణం మంజూరవుతుంది. తిరిగి చెల్లింపు విషయంలోనూ వెసులుబాటు లభిస్తుంది. కోర్సు పూర్తయిన సంవత్సరం తర్వాత నుంచి లేదా కోర్సు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాక ఆరు నెలల తర్వాత నుంచి (ఈ రెండిటిలో ఏది ముందు సాధ్యమైతే అప్పటి నుంచి) రుణం నెల వాయిదాల్లో తిరిగి చెల్లించాలి.
 
వెబ్‌సైట్:www.iba.org.in

 
స్కాలర్‌షిప్ సదుపాయాలు
 
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, బ్యాం కు రుణాలతోపాటు పలు స్కాలర్‌షిప్ పధకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫీజు మొత్తాన్ని అందించకపోయినా నెలవారీగా నిర్దేశిత మొత్తాలు లభిస్తాయి.

 
ఎన్‌టీపీసీ స్కాలర్‌షిప్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్:
 
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్ బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదివే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థుల కోసం అందిస్తున్న స్కాలర్‌షిప్ స్కీం ఇది. వెబ్‌సైట్:

 
సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్స్:
 
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నత విద్య ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన పథకం సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్స్. జాతీయ స్థాయిలో అమలు చేసే ఈ పథకం ద్వారా మొత్తం 82 వేల గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు. వీటిలో సగం మహిళా విద్యార్థులకు అందిస్తారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంవత్సరంలో పది నెలలపాటు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
 
వెబ్‌సైట్:www.cbse.nic.in

 
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్:
 
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న స్కాలర్‌షిప్ పథకం ఇది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండి ఇంటర్మీడియెట్ వరకు 60 శాతం మార్కులతో అకడమిక్ రికార్డ్‌తోపాటు ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. అకడమిక్ మెరిట్, తల్లిదండ్రుల ఆదాయ పరిమితి ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంవత్సరానికి పది నెలలు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
 
వెబ్‌సైట్:www.licindia.in

 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్కాలర్‌షిప్స్
 
గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ కోర్సు అడ్మిషన్ ఖరారు చేసుకున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కీం ఇది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండాలి. స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. మూడు వేలు వరకు ఆర్థిక చేయూత లభిస్తుంది.

 
వెబ్‌సైట్:www.iocl.com
 
ఏఐసీటీఈ - PRAGATI స్కాలర్‌షిప్స్
 
టెక్నికల్ ఎడ్యుకేషన్ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న స్కాలర్‌షిప్ పథకం PRAGATI (Providing Assistance for Advancement of Girl Participation in Technical Education) సింగిల్ గర్ల్ చైల్డ్‌గా ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. కుటుంబ వార్షికాదాయం రూ. ఆరు లక్షల్లోపు ఉండాలి. జాతీయ స్థాయిలో ఏటా నాలుగు వేల మంది విద్యార్థినులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. అకడమిక్ రికార్డ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థినులకు గరిష్టంగా రూ. 30 వేల ట్యూషన్ ఫీజుతోపాటు సంవత్సరంలో పది నెలలపాటు నెలకు రూ. రెండు వేలు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
 
వెబ్‌సైట్:www.aicte-india.org

 
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ మైనారిటీస్
 
కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ.. మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న స్కాలర్‌షిప్ పథకమిది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. మూడు లక్షల్లోపున్న మైనారిటీ వర్గాలకు చెంది న విద్యార్థులు అర్హులు. ఎంపికైన విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, మెయింటనెన్స్ అలవెన్స్ చెల్లిస్తారు.
 
వెబ్‌సైట్: www.minorityaffairs.gov.in

Saturday, April 26, 2014

ఆదాయ పన్ను కనీస మినహాయింపు-(బేసిక్ లిమిట్)-F.Y 13-14/A.Y 14-15


ఆదాయ పన్ను కనీస మినహాయింపును(బేసిక్ లిమిట్) రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఆర్థిక   శాఖ తోసిపుచ్చింది. వ్యక్తిగత పన్ను శ్లాబులను సవరిస్తే సుమారు రూ.60,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోవాల్సి వస్తుందని, దీంతో ఈ ప్రతిపాదనలను ఆమోదించడం లేదని ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా అమల్లోకి రానున్న డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ)లో పన్ను శ్లాబులను సవరిస్తూ యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది.

 బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడమే కాకుండా, రూ.3-10 లక్షల ఆదాయంపై10%, 10-20 లక్షల ఆదాయంపై 20%, ఆపైన ఆదాయం ఉన్న వారిపై 30% పన్ను విధించాలని   సిఫార్సు చేసింది. ఈ సూచనలు పాటిస్తే భారీగా పన్ను ఆదాయం తగ్గుతుందని 2013 డీటీసీ ప్రతిపాదనల విడుదల సందర్భంగా ఆర్థిక శాఖ వ్యాఖ్యానించింది. ప్రస్తుత స్లాబుల ప్రకారం వార్షిక ఆదాయం రూ. 2 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.2-5 లక్షల వరకూ 10%,  రూ. 5-10 లక్షలకు 20%, రూ. 10 లక్షలు దాటితే 30% పన్ను అమలవుతోంది.

  సీనియర్ సిటిజన్లకు సంబంధించి పన్ను మినహాయింపుల వర్తింపు వయస్సును  65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే సూపర్ రిచ్ ట్యాక్స్ పేరుతో కొత్త ట్యాక్స్ శ్లాబ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే 35 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  జీవిత బీమా కంపెనీలపై విధిస్తున్న 30% పన్ను పరిమితిని 15%కు కుదించాలన్న సలహాలను కూడా ఆర్థిక శాఖ పక్కనపెట్టింది. ఇదే విధంగా రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఆధారంగా పన్ను విధించాలన్న సూచననూ తిరస్కరించింది.

Friday, March 28, 2014

జీరో వడ్డీ స్కీమ్‌లు వద్దు

ఖరీదైన సెల్‌ఫోన్ కావాలా.. ముందుగా పైసా చెల్లించక్కర్లేదు! పైగా ఎలాంటి వడ్డీ లేకుండానే సమాన నెలసరివాయిదా(ఈఎంఐ)లలో డబ్బు కట్టేయొచ్చు. క్రెడిట్ కార్డు ఉంటే చాలు! ఇటీవలి కాలంలో ఇలాంటి జీరో వడ్డీ ఈఎంఐ స్కీమ్‌లు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. మొబైల్ ఫోన్‌లకే కాదు టీవీలు, ఫ్రిజ్‌లు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయ సంస్థలు ఈ తరహా స్కీమ్‌లతో ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు వీటన్నింటికీ ఆర్‌బీఐ చెక్ చెప్పింది. కన్సూమర్ గూడ్స్ కొనుగోళ్లకు సంబంధించి జీరో శాతం వడ్డీరేట్ల పథకాలను నిషేధిస్తున్నట్లు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో పండుగ సీజన్‌లో అమ్మకాల జోష్‌పై నీళ్లుచల్లినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 వినియోగదారుల మేలుకే...
 కాగా, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై కూడా ఎలాంటి అదనపు చార్జీలనూ వసూలు చేయరాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ‘ఒక ఉత్పత్తి అమ్మకానికి సబంధించి వడ్డీరేట్ల స్వరూపాన్ని బ్యాంకులు దెబ్బతీయకూడదు. ఇలాంటి చర్యల వల్ల ధరల విధానంలో పారదర్శకత లేకుండా పోతుంది. వినియోగదారుడు అన్ని అంశాలూ తెలుసుకొని అంతిమంగా తగిన నిర్ణయం తీసుకోవాలంటే వాస్తవ ధర అనేది చాలా ముఖ్యం’ అని ఆర్‌బీఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలు జీరో వడ్డీరేట్లు అనే విధానమే పూర్తిగా తప్పుదోవపట్టించే అంశమని కూడా ఆర్‌బీఐ అంటోంది. ‘ఏదైనా ఉత్పత్తి, సంబంధిత విభాగం విషయంలో ప్రాసెసింగ్ చార్జీలు, ఎంత వడ్డీరేట్లు విధిస్తున్నారనేది కచ్చితంగా, పారదర్శకంగా తెలియజేయాల్సిందే.

 కస్టమర్లకు ఏదో ఒక ఆశజూపి వాళ్ల జేబు గుల్ల చేసేందుకే ఇలాంటి ‘జీరో’ స్కీమ్‌లు పుట్టుకొస్తున్నాయని కూడా ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. వాస్తవానికి జీరో వడ్డీ కింద ఆఫర్ చేస్తున్న ఈఎంఐ స్కీమ్‌లలో ప్రాసెసింగ్ చార్జీల రూపంలో వడ్డీని నిగూఢంగా ఉత్పత్తి ధరకే జతచేసి విక్రయ సంస్థలు మాయ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి డబ్బు చెల్లించి కొనుగోలు చేయలేని వినియోగదారులు అసలు ఉత్పత్తి ధరను పట్టించుకోకుండా... వడ్డీలేకుండా సులభ వాయిదాలకు మొగ్గుచూపుతున్నట్లు ఆర్‌బీఐ పరిశీలనలో వెల్లడైంది. ఇదేకాదు.. కొన్ని బ్యాంకులు కూడా ఇలాంటి మసిపూసే కొన్ని చర్యలకు పాల్పడుతున్నాయనేది వెలుగులోకి వచ్చింది. ఏదైనా ఉత్పత్తి కొనుగోలు కోసం కస్టమర్లకు ఆఫర్ చేసే రుణంపై విధించే వడ్డీరేటులోనే అదనపు రుసుము(ప్రాసెసింగ్, కమిషన్ చార్జీ ఇతరత్రా) వడ్డింపులను కలిపి ఈఎంఐలను వసూలు చేస్తున్నాయనేది

 ఆర్‌బీఐ పరిశీలన.
 రిటైల్ ఉత్పత్తులకు విభిన్న వడ్డీరేట్లు వద్దు...
 ఒకే విధమైన ప్రొడక్ట్, సమాన కాలవ్యవధిగల రుణాలకు ఒక్కో కస్టమర్‌కు ఒక్కో విధమైన వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకులపై కూడా ఆర్‌బీఐ దృష్టిసారించింది. ఇటువంటి డిఫరెన్షియల్ వడ్డీరేట్ల విధానాన్ని రిటైల్ ఉత్పత్తులకు ఇచ్చే రుణాలకు వర్తింపజేయరాదని కూడా ఆర్‌బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ముఖ్యంగా రిటైల్ ఉత్పత్తుల విషయంలో కస్టమర్ రిస్క్‌తత్వంతో సంబంధంలేకుండా ఒకేవిధమైన(ఫ్లాట్) వడ్డీరేటును అమలు చేయాలని తేల్చిచెప్పింది.

 మరోపక్క, ఏదైనా వడ్డీరేట్ల తగ్గింపు ఆఫర్‌లపైనా కొరఢా ఝుళిపించింది. కస్టమర్లకు ఉత్పత్తి కొనుగోలు కోసం ఇచ్చే రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని అందించాలంటే... విక్రయ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్‌లను పరిగణనలోకి తీసుకున్నాకే రుణ మొత్తాన్ని మంజూరు చేయాలని స్పష్టీకరించింది. రుణ చెల్లింపుపై ఏదైనా మారటోరియం వంటి ప్రయోజనం ఉంటే... బ్యాంకులు ముందుగానే తగిన రీపేమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు అనేది కూడా మారటోరియం వ్యవధి తర్వాత నుంచే ఉండాలని... వడ్డీరేటును పూర్తి కాలవ్యవధికి సర్దుబాటు చేయకూడదని కూడా నోటిఫికేషన్‌లో తెలిపింది. ఉత్పత్తిపై డీలర్లు, తయారీ కంపెనీలు అందించే డిస్కౌంట్లు, ప్రయోజనాలను కస్టమర్లకు పూర్తిగా లభ్యమయ్యేలా రుణాలను అందించే బాధ్యత బ్యాంకులదేనని ఆర్‌బీఐ పేర్కొంది.

 డెబిట్ కార్డులపై...
 కొన్ని విక్రయ కేంద్రాల(పాయింట్ ఆఫ్ సేల్స్) వద్ద ఏదైనా ఉత్పత్తి/సేవల కొనుగోలు కోసం డెబిట్ కార్డుల ద్వారా సొమ్ము చెల్లిస్తే... ఆ మొత్తం లావాదేవీపై కొంత శాతాన్ని అదనపు ఫీజుకింద వసూలు చేస్తున్న ఉదంతాలు కూడా ఆర్‌బీఐ దృష్టికెళ్ళాయి. ఇలాంటి రుసుములు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. అదనపు చార్జీలను వడ్డించే విక్రయ సంస్థలతో బ్యాంకులు ఒప్పందాలను తెగదెంపులు చేసుకోవాలని ఆదేశించింది. ఇటువంటి చర్యలు, ఉత్పత్తుల విక్రయం అనేది పారదర్శక, నిష్పాక్షిక ధరల విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనదని... వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీసేదని కూడా ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. వీటివల్ల రుణాలు, వడ్డీరేట్లకు సంబంధించిన మూల ఉత్తర్వుల్లోని నిబంధనలను తుంగలోకి తొక్కినట్లవుతుందని  పేర్కొంది. కస్టమర్ల హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవహరించవద్దని బ్యాంకులకు ఆర్‌బీఐ హితవుపలికింది.

నాన్నా! డబ్బంటే క్రెడిట్ కార్డు కాదు..

డబ్బంటే  నీ దగ్గరున్న క్రెడిట్ కార్డులు కాదు. నీ ఖర్చనేది ఈ డబ్బును బట్టే ఉండాలి తప్ప నీ క్రెడిట్ లిమిట్‌ను బట్టి కాదు. నెల తిరిగేసరికల్లా నువ్వు ఈజీగా ఎంత తిరిగి చెల్లించగలవో... అంత పరిమితినే వాడు.

  కార్లు, టీవీలు, ఫోన్లు, ఏసీలు వగైరాలన్నీ ఆస్తులేనని అంతా చెబుతుంటారు. అది నిజం కాదు. అవి అప్పులే. కారణమేంటంటే అవి తరిగిపోతుంటాయి. వాటిని ఉపయోగించడానికి కూడా నీకు డబ్బు కావాలి. అలాంటి నకిలీ ఆస్తుల్ని అట్టే పోగేసుకోకు.

  చేతిలో డబ్బుల్లేవని ఇబ్బంది పడకుండా, నీ డబ్బులెక్కడున్నాయో నీకు తెలిసేలా... ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్లని, బీమాని విడిగా చెయ్యి. ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా పనికొచ్చే బీమా పాలసీని కొనకపోవటమే మంచిది.

  అప్పు చేయటమంటే... నువ్వు భవిష్యత్తులో సంపాదించబోయే డబ్బుని కూడా ఇప్పుడే ఖర్చుచేయటం. అందుకని జాగ్రత్త. నిజంగా అవసరమొచ్చి అప్పు తీసుకోవాలనుకుంటే... తగిన మొత్తాన్ని, తగిన వడ్డీకి మాత్రమే తీసుకో.

  ఏ పొదుపైనా సరే. త్వరగా ఆరంభించు. దాన్ని మానకుండా కొనసాగించు. షేర్లు, డిపాజిట్లు, ఆస్తులు, బంగారం ఏదైనా సరే... కాలాన్ని బట్టే పెరుగుతాయి. కాలమే ముఖ్యం.

  పన్ను తగ్గించుకోవటం ముఖ్యమే. అందుకోసమని డబ్బంతా తీసుకెళ్లి రాబడి రానిచోట పెట్టుబడి పెట్టడం సరికాదు. అయినా పన్ను పొదుపు కోసం మార్చి దాకా ఆగొద్దు. ఏప్రిల్లోనే మొదలుపెట్టు.
  జీవిత బీమా, మెడికల్ ఇన్సూరెన్స్... ఇలా ఏది ఎంచుకున్నా సరళంగా ఉండే పాలసీని తీసుకో. సంక్లిష్టంగా పదిరకాలు కలిసి ఉండేవి ఎక్కువ లాభాన్నిస్తాయని అనుకోవద్దు.

  షేర్లు కొంటావా? అది మార్కెట్ నిపుణులకు వదిలెయ్. కారు డ్రైవింగ్ వచ్చు కాబట్టి రేసుల్లోనూ నడిపేస్తానంటే కుదరదుగా! అందుకని మ్యూచ్‌వల్ ఫండ్స్ లాంటివి ఎంచుకుంటే మంచిది.
  రంగురంగుల ప్రకటనలు, అందమైన వాగ్దానాలు ఎప్పుడూ నమ్మొద్దు.

  పర్సనల్ ఫైనాన్స్ మరీ కష్టమైందేమీ కాదు. నువ్వు స్కూల్లో చదివిన మిగతా సబ్జెక్టుల్లాంటిదే. అందుకని డబ్బు ఖర్చు చేసే ముందు... దాన్నెలా ఖర్చు చేయాలో తెలుసుకోవటానికి కొంత సమయం ఖర్చబెట్టు. ఆల్ ది బెస్ట్.

Address for Communication

Address card