Tuesday, February 07, 2017

‘టెర్రర్ టూరిజం’



    - మేధావితనం కన్నా మానవత్వం గొప్పది.

             మన మిత్రుడు,’పొన్నూరు ఫ్రెండ్సు’ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ ,రిపోర్టర్  శ్రీ బషీర్,గారు పంపిన ‘చీరాల విలేఖరి పై దాడి’ వార్తని, ఆవెంటనే మరో మిత్రుడు విశాలాంద్ర విలేఖరి శ్రీ ప్రసాద్(లాలీ) గారు,నిరసన ర్యాలీ చేద్దామా అని మెస్సేజ్  చదివాక దీని గురించి  వచ్చిన ఆలోచనల పరిష్వంగం  లో కొన్ని నఖక్షతాలు



            “టెర్రర్ టూరిజం”-ఈ పదం వినటానికి కొత్తగా వున్నా మనందరికీ అలవాటయిన విషయమే.ఎలాగంటే రోడ్డు మీద ఒక ప్రమాదం సంభవిస్తుంది. చిన్నదో లేక పెద్దదో. చుట్టూ జనం చేరి ఆసక్తిగా చూస్తూ వుంటారు. సర్రిగ్గా ఇదే “టెర్రర్ టూరిజం” అంటే
             ఆ దుర్ఘటన జరిగిన చోటు నుండి కిలోమీటరు మేర వాహనాల రాకపోకలు స్థంబించిపోతాయి. ఏ 108 ఆంబులెన్సో లేక మరో ఆంబులెన్సో కూత వేసుకొంటూ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకోడానికి నానా అగచాట్లు పడుతుంది. ఆ ప్రమాదం జరిగిన చోటు వాహనాలు ఇరుక్కు పోతాయి. ప్రమాదం జరిగినందుకు కాదు, ఏమి జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆ ప్రదేశానికి చేరుకొన్న ప్రతీ వాహనం గతిని తగ్గించి దాని చోదకుడు ఆత్రంగా ఏమి జరిగిందోనని తెలుసుకోవాలన్న తపన వల్ల.
             కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలూ అన్నీ! -దిగి సహాయం చేయాలన్న ఆలోచన ఉండదు కానీ, ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఆత్రం. ఒకరిద్దరు మాత్రం మనుషులు ఉంటారు. పక్కనే వాహనాన్ని నిలిపి సహాయం చేయడానికి పూనుకొంటారు. మిగతా అందరూ తమ వాహనాల గతిని తగ్గించి, తమ వంతు విఘాతము కలిగించి, ఒకో సారి ప్రాణాల మీదకే తెస్తారు. వీరి ఆత్రం పుణ్యమా అని రాకపోకల గతి తగ్గి, ఆ రద్దీలో ఆంబులెన్సు సరైన సమయానికి చేరుకోలేక ప్రమాదానికి లోనైన వ్యక్తి ప్రాణాలు పోతే?
అన్ని చోట్లా ఈ చోద్యం చూసే ప్రవర్తనే! పక్కింట్లో గొడవ, బజార్లో హత్త్య, దోపిడీ దొంగతనం, ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నా నిలబడి చ్యోద్యం చూడడం, నిన్న చీరాలలో విలేకరిపై దాడి, మొన్న హైదరాబాదు బాంబు పేలుళ్ళ దృశ్యాలు (టీ.వీ. లో చూస్తున్నపుడూ) ఇదే తంతు. శవాలు ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. ప్రదేశం రక్తసిక్తమయి ఉన్నది. గాస్ సిలిండర్లు చెల్లా చెదరుగా పడి ఉన్నట్టు కనిపించింది. మరింకేవన్నా పేలని బాంబులు ఉన్నాయా అనే అనుమానం. అయినా సరే. వెళ్ళి చోద్యం చూడాలి. సెల్ ఫోన్లతో ఫొటోలు తీయాలి. పోనీ ఒక సారి చూసి వెళ్ళిపోయినా అనుకోవచ్చు. అక్కడే ఉండి ఏమి జరుగుతున్నదో చూసి తీరాల్సినదే! పోలిసుల పనికీ, సహాయక చర్యలకూ అడ్డం పడుతున్నామని తెలిసినా సరే! ఉత్సుకతను మాత్రం ఆణుచుకోలేము. కీలక సాక్ష్యాలు చెరిగిపోవచ్చు. ప్రాణాలు కొన ఊపిరితో బిగపట్టుకొనున్నవారికి సహాయం అందడంలో జాప్యం జరుగవచ్చు. ఐతే మాత్రం? ఇలాంటి Terror Tourism అవకాశాలు మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా?
మనకు అన్నీ ఒకటే. సినిమా షూటింగ్ అయితేనేమి, ప్రమాదం అయితేనేమి, బాంబు పేలుళ్ళు అయితేనేమి? చుట్టూ గుమిగూడుతాం, చోద్యం చూస్తాం!
        సహాయం చేయక పోవటానికి అసలు కారణం మానవత్వం లేక కాదు తర్వాత మనం ఇబ్బంది పడతామేమో అనే భయం .‘మనకెందుకులే’  లేదా  ‘మనమే ఎందుకు’ అనే సమాదానం లేని ప్రశ్న మనకి సంతృప్తి నిస్తుంది. దాని సమాధానం సంఘ విద్రోహులకి బలాన్నిస్తుంది. ‘ఎందుకలా’ అనే ప్రశ్న సమాజం నుంచి ఎప్పుడు వస్తుందో , ఎప్పుడైతే బాధితుడికి మనోబలంగా ,పక్కనున్నవారి మద్దతు లభిస్తుందో, ఎక్కడయితే అన్యాయాన్ని నిలదేసే వారు  ఉంటారో . అప్పుడే-ఖచ్చితంగా అప్పుడే సమాజానికి పట్టిన అన్ని వైరస్ లు నశించి పోతాయి . నాయకులు ఖల్ నాయుకులు కాకుండా నిజమైన నాయకులవుతారు------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card