Tuesday, October 28, 2014

సైబర్ ముప్పు



గ్రవాద చర్యలతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఆల్‌ఖైదా మూకలను తేలికపాటి మానవరహిత విమానం 'ద్రోణ్' బెంబేలెత్తించింది. ఒక యాభై వేల రూపాయలు వెచ్చిస్తే- అదే విమానాన్ని 'హ్యాక్' చేసి తమ నియంత్రణలోకి తెచ్చుకుని పెను విధ్వంసానికి పాల్పడవచ్చని కొందరు సైబర్ నిపుణులు నిరూపించారు. గత నెలలో న్యూమెక్సికోలో ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష నిర్వహించి వారు విజయం సాధించారు. స్ఫూఫింగ్ అనే ప్రక్రియ ద్వారా ద్రోణ్‌ను తమ అదుపులోకి తెచ్చుకోగలిగారు. అయితే ఇదంతా అమెరికా రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగ ప్రక్రియ. అలాంటి సాంకేతిక పరిజ్ఞానం పొరపాటున సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే, వారే ఈ నైపుణ్యాన్ని సొంతం చేసుకోగలిగితే? ఆ ఊహే ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనలో ముంచెత్తుతోంది!

వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు
నింగిలో ఎగురుతున్న ద్రోణ్ విమానాన్ని తమ అదుపులోకి తీసుకురాగల పరిజ్ఞానం ఆవిష్కృతమైంది. భవిష్యత్తులో అసాంఘిక శక్తులు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రయాణీకుల విమానాన్నో, దాన్ని నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కంప్యూటర్లలోకి చొరబడితే? ఆ నష్టం అనూహ్యం! ఇలా జరగడానికి ఆస్కారం లేదని భరోసా ఇవ్వలేని పరిస్థితులే అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్నాయి. గత వారం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లను 'డీఎన్ఎస్ ఛేంజర్' అనే మాల్‌వైర్ స్తంభింపజేసి ప్రకంపనలు సృష్టించింది. దీని తాకిడికి అనేక సంస్థలు తమ సర్వర్లను ముందుజాగ్రత్తగా మూసివేశాయి. ప్రపంచానికి పొంచిఉన్న సైబర్ ముప్పునకు ఈ ఉదాహరణలే ప్రబల నిదర్శనాలు. అంతేకాదు సైబర్ దాడుల ముసుగులో ఇంతకన్నా ప్రమాదకర పరిస్థితి ప్రస్తుతం ప్రపంచం ముంగిట్లో ఉంది. ప్రత్యర్థి దేశాలు రక్షణ రంగంలో ఒకరిపై ఒకరు సైబర్ అస్త్రాలను సంధించుకుంటున్న వైనాన్ని కథలుగా విన్నాం. ఇప్పుడు అనేక దేశాల్లోని సైబర్ నేరస్థుల ముఠాలు ఆన్‌లైన్‌లో కుమ్మకై, వేలకోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. మరోపక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొందరు తమకు గిట్టనివారి వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీడుస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాల్లో మనరాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఇటీవల జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించడం- ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. సైబర్ దాడులనుంచి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వాలు నానాపాట్లు పడుతున్నాయి. బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలూ తమ ఖజానా సైబర్ ముఠాల బారినపడకుండా ఉండటానికి అష్టకష్టాలు పడుతున్నాయి. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవడం ఇంచుమించు అసాధ్యంగా మారింది. వెరసి, ప్రస్తుత సమాచార సాంకేతిక యుగంలో మనిషి జీవితం అనిశ్చితికి మారుపేరుగా నిలుస్తోంది.
ఇరాన్‌లోని అణురియాక్టర్లను తన నియంత్రణలోకి తెచ్చుకున్న 'స్టక్స్‌నెట్' ఉదంతం గుర్తుండే ఉంటుంది. ఇరాన్ చేపట్టిన అణుకార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి స్టక్స్‌నెట్‌ను రూపొందించాయి. దీన్ని అణురియాక్టర్లను నియంత్రిస్తున్న కంప్యూటర్ వ్యవస్థలోకి చొప్పించాయి. దాంతో ఆ కంప్యూటర్లు నియంత్రణ కోల్పోయి పనిచేయకుండా ఆగిపోయాయి. అణురియాక్టర్లు నిలిచిపోయాయి. ప్రపంచ దేశాల మధ్య మొదలైన సైబర్ యుద్ధానికి ఈ ఉదంతం ఉదాహరణ. అదే ఊపుతో 'ఫ్లేమ్' పేరుతో సమాచారం తోడివేసే (డేటామైనింగ్) వైరస్‌ను అమెరికా రూపొందించింది. కంప్యూటర్‌లోకి చొరబడిన తరవాత సమస్త సమాచారాన్నీ ఇది తస్కరించి తన యజమానికి చేరవేస్తుంది. కీ బోర్డు మీద టైపుచేసే ప్రతి మాట, కంప్యూటర్లో చూసే ప్రతి పేజీనే కాదు, అక్కడ జరిగే సంభాషణలనూ యజమానికి అందజేస్తుంది. కంప్యూటర్ అనుసంధాన వ్యవస్థల్లోని నిర్దుష్ట సమాచారాన్ని స్కాన్‌చేసి మరీ చోరీ చేస్తుంది. దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు సైబర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాయనడానికి ఇదో నిదర్శనం. శత్రుదేశం వెబ్‌సైట్లను హ్యాక్‌చేసి పిచ్చిమాటలతో నింపివేసే ధోరణులు పోయి, కీలక వ్యవస్థలనే నియంత్రణలోకి తెచ్చుకోగలిగే రోజులు వచ్చేశాయి.
ఇరాన్ అణుకార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయిల్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు చైనా తన పని తాను నింపాదిగా చేసుకుంటూ పోతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్వయంగా రంగంలోకి దిగి అమెరికాతోపాటు అనేక ఇతర దేశాలనుంచి సున్నితమైన సమాచారాన్ని చోరీ చేస్తోంది. చైనా చేపట్టిన సైబర్‌యుద్ధ తంత్రం తమ భద్రతా వ్యవస్థకు ప్రమాదకరంగా మారిందని అమెరికా ఆందోళన చెందుతోంది. యుద్ధంలాంటి విపత్తు సంభవించినప్పుడు అమెరికా తక్షణమే కార్యాచరణలోకి దిగకుండా నిరోధించగలిగే సామర్థ్యం చైనా సమకూర్చుకుందని ఇటీవల అమెరికా కాంగ్రెస్ సలహా మండలి ఒక నివేదికలో హెచ్చరించింది. దాదాపు అన్ని దేశాలు సైబర్ దాడులనుంచి తప్పించుకునేందుకు భద్రత చర్యలు చేపడుతున్నాయి. సైబర్ ఆయుధాలనూ రూపొందించుకుంటున్నాయి. శాంతికాముక దేశమైన జపాన్ సైతం సైబర్ ఆయుధాల రూపకల్పనకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తన రక్షణకోసం చర్యలు తీసుకునే హక్కు ప్రతి దేశానికీ ఉంది. కాని ప్రత్యర్థి దేశాన్ని ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదు. ప్రత్యర్థి దేశం కంప్యూటర్ల వ్యవస్థలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్న ప్రస్తుత ధోరణులు భవిష్యత్తులో ప్రపంచ వినాశనానికి దారి తీయవచ్చు. అణురియాక్లర్లు వాటంతట అవే పేలిపోయేలా, క్షిపణులు హఠాత్తుగా గాలిలోకి ఎగిరేలా వాటి వ్యవస్థలను నియంత్రించే ప్రయత్నాలు- ప్రపంచ భవిష్యత్తుకే పెను ప్రమాద ఘంటిక!
దేశాల మధ్య జరుగుతున్న సైబర్ యుద్ధాన్ని పక్కనపెడితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సైబర్ ముఠాలు పేట్రేగిపోతున్నాయి. దేశదేశాల్లోని సైబర్ నేరస్థులు ఒక్కటై ముఠాలుగా ఏర్పడుతున్నారు. చోరీ సమాచారాన్ని మార్పిడి చేసుకొంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అమెరికాలోని ఫెడరల్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనే ఆర్థిక సంస్థనుంచి రెండు రోజుల వ్యవధిలో ఓ ముఠా 130లక్షల డాలర్లు తస్కరించడం అందుకు దాఖలా. వారు బ్యాంకు సర్వర్‌లోకి చొరబడి ఖాతాదారుల డెబిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించారు. డెబిట్ కార్డుల ద్వారా డబ్బు తీసుకునే సదుపాయం పరిమితంగా ఉంటుంది. బ్యాంకు సర్వర్‌లోకి చొరబడిన ముఠా ఈ పరిమితిని అపరిమితం చేసింది. అనంతరం డెబిట్‌కార్డుల సమాచారాన్ని గ్రీస్, ఉక్రెయిన్, ఇంగ్లాండ్, రష్యా, స్పెయిన్ దేశాల్లోని సభ్యులకు పంపింది. ఈ సమాచారంతో వారు అక్కడ నకిలీ డెబిట్ కార్డులు సృష్టించారు. ఏటీఎం కేంద్రాల ద్వారా 130లక్షల డాలర్లు తస్కరించగలిగారు. ఇలాంటి నేరాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఇందుకు ఆర్థిక సంస్థలూ మినహాయింపు కాదు. పేరొందిన ఆర్థిక సంస్థలు సైతం సైబర్ నేరాల పాల్పడుతున్నాయి. విశ్వసనీయత కోల్పోతామన్న భయంతో ఆయా సంస్థలు తమ నష్టాలను బయటకు చెప్పుకోలేకపోతున్నాయి. దీంతో సైబర్ నేరగాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. ఎనానిమస్, డార్క్‌మేటర్, మాస్టర్ ఆఫ్ డిసెప్షన్స్, షోడోక్రూ వంటి పేర్లతో ఈ ముఠాలు వందల మందిని సభ్యులుగా చేర్చుకొని తమ సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టుకొంటున్నాయి. తస్కరించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ అవలీలగా సీమాంతర నేరాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్లవల్ల వ్యాపార సంస్థలే ఎక్కువగా నష్టపోతున్నాయి. 2011లో అమెరికా సైబర్ నేరగాళ్లు వివిధ సంస్థలకు చెందిన 25వేలకోట్ల డాలర్ల మేథోసంపత్తిని కొల్లగొట్టారని ఆ దేశ రక్షణ సంస్థ 'పెంటగాన్' సైబర్ కమాండ్ అధినేత కీత్ అలగ్జాండర్ వాపోయారు. ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్లనుంచి కాచుకోవడానికి అమెరికా సంస్థలు నిరుడు ట్రిలియన్ డాలర్లు ఖర్చుపెడుతున్నాయని తేలింది. 'ఫార్చున్' సంస్థ 500 కంపెనీల్లోని 168 సంస్థలను అధ్యయనం చేసినప్పుడు వాటిలో 162 సంస్థలు హ్యాకింగ్ బారినపడినట్లు తేలింది. దీన్నిబట్టి సైబర్ నేరగాళ్లవల్ల వ్యాపార సంస్థలకు జరుగుతున్న నష్టం ఏపాటిదో అర్థమవుతోంది. గత ఏడాది ప్రఖ్యాత గూగుల్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, సోనీ, ఏటీ అండ్ టీ సంస్థలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిస్సాన్‌తోపాటు విసా, మాస్టర్‌కార్డ్ సంస్థలూ హ్యాకింగ్ బారినపడ్డాయి. మనదేశం విషయానికి వస్తే, గత ఏడాది సైబర్ నేరాల కారణంగా రూ.35వేలకోట్ల నష్టం సంభవించింది. ఈ తరహా నేరాల విషయంలో మనదేశం ప్రపంచంలో అయిదో స్థానానికి చేరిందని మెకాఫీ నివేదిక తెలిపింది. 2012 మొదటి మూడు నెలల్లో దేశంలోని వంద ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 43.1కోట్లమంది సైబర్ నేరాల బారిన పడితే, అందులో మనదేశంలోనివారు 2.9కోట్లమంది ఉన్నారు. తప్పుడు సమాచారంతో బుట్టలో వేసుకునే స్పామ్ మెయిల్ విషయంలో మనదేశం అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రోజూ 8,950కోట్ల స్పామ్ మెయిళ్లు బట్వాడా అవుతున్నట్లు తేలింది.
కొత్త వ్యూహాలు జరూరు
జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం నిరుడు మనరాష్ట్రం మొత్తం మీద ఐటీ చట్టం కింద 349 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. ఈ అంశంలో దేశంలోనే మనది మొదటిస్థానం. గత ఏడాది ఈ కేసుల సంఖ్య కేవలం 105. అరెస్టుల విషయంలోనూ(242మంది) దేశంలో మన రాష్ట్రానిదే ప్రథమ స్థానం. అంతర్జాలంలోని సామాజిక అనుసంధాన వేదిక(సోషల్ నెట్‌వర్క్) పరిచయాల ఆధారంగా మోసాలకు పాల్పడేవారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా మాయమాటలతో యువతులను మోసగించి, వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఉదంతాలు రోజూ వెలుగుచూస్తున్నాయి. ఈ విషసంస్కృతి మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. అయినా అనేక ఘటనలు కేసులుగా నమోదు కావడంలేదు.
దేశంలో ఆన్‌లైన్ లావాదేవీల వ్యాపారమూ శరవేగంగా విస్తరిస్తోంది. అయినా సైబర్ నేరాలపట్ల ప్రజలకు ఉన్న అవగాహన బాగా తక్కువ. అందుకే లాటరీ తగిలిందని తప్పుడు మెయిల్ పంపించి పెద్దయెత్తున డబ్బు కొల్లగొట్టే నైజీరియన్ మోసాల సంఖ్య మనదగ్గరే ఎక్కువవుతోంది. రూ.కోట్ల విలువచేసే లాటరీ కలిసిందని చెప్పగానే వెనకాముందు ఆలోచించకుండా అడిగినంత డబ్బు మాయగాళ్ల ఖాతాల్లో డిపాజిట్ చేసేవారి సంఖ్యకూ కొదవలేదు. సైబర్ నేరాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాయనడంలో సందేహంలేదు. వీటిపట్ల ప్రజలను అప్రమత్తుల్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సైబర్ నేరాలను పసిగట్టి నిందితులను అరెస్టు చేయాలంటే నిఘా వ్యవస్థలను సాంకేతికంగా బలోపేతం చేయాల్సి ఉంది. ఇతర దేశాల మాదిరిగా దేశరక్షణకు సంబంధించి సరికొత్త సైబర్ యుద్ధతంత్ర వ్యూహాలను రచించాలి. అప్పుడే దేశానికి, దేశపౌరులకు సంపూర్ణ భద్రత లభించినట్లు!


No comments:

Post a Comment

Address for Communication

Address card