Wednesday, August 15, 2018

స్వాతంత్రం రాకుండా ఉండుంటే ఎలా ఉండేవాళ్ళం



మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భైరెండేడ్లు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.  ప్రస్తుతానికి సాధించింది ఎంతో మనందరకూ తెలుసు. "బ్రిటిష్ వాళ్ళ కభంద హస్తాలలో చిక్కుకొని, కార్చడానికి కన్నీరు ఇంకి పోయి, తన బిడ్డలా అవస్థలు చూడలేక, వాళ్ళకు విముక్తిని ప్రసాదించలేకఆ విషపు కోరల మధ్య నలిగిపోయిన భారత మాత ద్రాస్య సృంఖలాలు తెంచిన స్వాతంత్రం"..  బాబోయి ... చాలు  ..బాబోయి.. చాలు .. ఈ తాండ్ర పాపారాయుడు టైపు డైలాగులకు ఇది సమయం కాదు కానీఅసలు స్వాతంత్రం రాలేదు అనుకొంటే మన దేశ పరిస్థితి ఎలా ఉండేది? ఒక సారి తమాషాగా చూద్దాం.
  • బ్రిటిష్ వాళ్ళు పెట్టిన  మనదేశం పేరు మారదు కానీ ఇండియా, యుకె లో భాగం అయ్యి ఉండేది. అంటే మనం లండన్ వెళ్లి ఆక్ఫోర్డ్,  Cambridge university లో చదవాలంటే  VISA అక్కర లేదు. 
  •  మనవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు లండన్, యుకె వెళ్లి పనిచేసుకోవచ్చు. టికెట్ కొని వెళ్ళడమే అంతే.
  • ఒక్క యుకె మాత్రం కాదు, ఐరోపా ఖండం మొత్తం తిరిగి రావచ్చు. ఎక్కడైనా పని చేసుకోవచ్చు.
  • అమెరికా వెళ్ళాలంటే 90 డేస్ వీసా ఫ్రీ ఎంట్రీ. ఈజీ గ్రీన్ కార్డు ప్రాసెస్సింగ్.
  • మన కరెన్సీ పౌండ్ అయివుండేది. ఒక పౌండ్ అంటే దాదాపు 75 రూపాయలు, అమెరికన్  డాలర్ కంటే చాల ఎక్కువ అంటే అమెరికన్స్ కన్నా ధనవంతులం. 
  • రిజర్వేషన్ లు ఉండేవి కాదు, టాలెంట్ ఉన్నోడిదే ఉద్యోగం. 
  • ఆంధ్ర, తెలంగాణా అంటూ  ఉన్న టైం అంత తగలేసే ఉద్యమాలు ఉండేవికాదు. 
  • చీటికి మాటికి నిరాహార దీక్షలంటూ, ఓట్లకోసం రైతు జపం చేసిరోడ్డుల మీద, రైలు పట్టాల మీద పడుకొని, అదే ఒక ఉద్యమం అని మురిసిపోయేపనికిమాలిన రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు కాదు. 
  •  విశ్వ విద్యాలయాల్లో చదువుకొంటున్న విద్యార్ధులే ప్రభుత్వ ఆస్తులు  ధ్వంసం చేస్తేఆ ఆస్తులు రక్షించాల్సిన ప్రజా నాయకులే వాళ్ల మీద కేసులు ఎత్తివేయాలని సిగ్గులేని డిమాండులు చేసి ఉండేవాళ్ళు కాదు.
  • తెల్ల రేషన్ కార్డులు, పచ్చ రేషన్ కార్డులు, రెండు రూపాయల బియ్యం, రచ్చ బండ, గుదిబండ, లాంటి ఒట్లాకర్షణ గిమ్మిక్కులు ఉండేవి కావు. 
  • మన బస్సులు మనమే తగల బెట్టుకొనిఅదో గొప్ప ఘనకార్యం గా మురిసిపోయే మూర్ఖ ప్రజలను, నాయకులను చూసి గర్వపడే దౌర్భాగ్యపు స్థితిలో ఉండేవాళ్ళం కాదు. 
  • పాకిస్తాన్ నుండి వచ్చి, వందల మందిని పట్ట పగలు చంపిన వాడికి, సాక్షాలు సరిపోలేదంటూ ఇంకా రాచ మర్యాదలు చేస్తూజైల్లో చికెన్ బిరియానిలు తినిపించే వాళ్ళం కాదు. 
  • మనకు తల్లి లాంటి  పార్లమెంటు మీద దాడి చేసినాలుగురు  సైనికులను చంపినవాడినిమత ప్రాతిపదికన, ఓట్ల కారణంగా ఉరి తియ్యలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు.
ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో, మరెన్నో. నష్టాలు కూడా చాలా ఉండొచ్చు ఇది కేవలం   హాస్యం కోసంతప్ప చర్చావేదిక కాదు.జస్ట్ నవ్వుకోండి అంతే
స్వతత్రం వచ్చి మంచి జరిగిందాలేక పెనం మీద నుండి పొయ్యిలో పడిన సామెత లాగాక్రూరత్వం, మరెంతో తెలివైన పరిపాలన కలిగిన బ్రిటిష్ వాళ్ళనుండిమూర్ఖపుకుల-మత ప్రాతిపదికన పరిపాలించే మన భారతీయ రాజకీయ నాయకుల చేతుల్లో పడ్డామా  అనేది ఎప్పటికి అర్ధం కానీ ప్రశ్న. 
..  జై భారత్ , జై జై భారత్.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Tuesday, August 14, 2018

స్వాతంత్ర్యాన్ని మించిన అవసరం వేరే ఏమీ లేదు



ఒక ముసలి రాజుగారి దగ్గర ఒక పిట్ట ఉండేదట. అది మనిషిలాగా మాట్లాడేదట. రాజుగారు దానికి ఓ బంగారు పంజరం చేయించి శ్రద్ధగా సాకేవాడు. అది కోరిన కోరికల్లా తీర్చేవాడు. డెబ్భైరెండేళ్ళు  అలా కలిసి బతికారు వాళ్లు.
ఓసారి రాజుగారు దూరదేశం వెళ్లాల్సి వచ్చింది. మధ్యదారిలో ఈ పిట్ట పుట్టినిల్లు ఉంది. రాజుగారు వెళ్తూ వెళ్తూ అడిగారు: " పిట్టా, మీ పుట్టినింటి మీదుగా వస్తాను, మీ వాళ్లకు నీ గురించి ఏమైనా చెప్పాలా? " అని. " మీ చెల్లి మీగురించే రోజూ ఆలోచిస్తోంది, రావాలంటే వీలు చిక్కటం లేదు " అని చెప్పమంది పిట్ట.
సరేనని రాజుగారు ప్రయాణమయ్యారు. వెనక్కి వస్తూ పిట్ట పుట్టినిల్లు ఉండే చెట్టు దగ్గర ఆగి బిగ్గరగా అరిచారు: " మీ చెల్లి మీగురించే రోజూ ఆలోచిస్తోంది, రావాలంటే వీలు చిక్కటం లేదు " అని. ఆ మాట వినగానే అక్కడి పక్షులన్నీ నిశ్శబ్దం అయిపోయాయి. ఒక పిట్ట టప్పున క్రిందపడి గిలగిలా తన్నుకొని నిశ్చేష్టం అయిపోయింది.
రాజుగారు నొచ్చుకున్నారు. వెనక్కి వచ్చి తన పిట్టకు ఈ సంగతి చెప్పారు బాధగా. వినగానే ఆ పిట్టకూడా నిశ్శబ్దం అయిపోయింది. టప్పున క్రిందపడింది. ఇక కదలలేదు. రాజుగారికి దు:ఖం వేసింది. పంజరంలోంచి దాన్ని బయటికి తీసి బాధగా కిటికీ దగ్గర పడుకోబెట్టారు.
మరుక్షణంలో అది ఎగిరింది. దూరంగా చెట్టుకొమ్మన వాలింది. బిగ్గరగా ఇలా అన్నది: " రాజా, నేను ఇప్పుడు ఏం చేయాలో మా అక్క నాకు నీ ద్వారానే కబురంపింది. " అని.
రాజుగారు ఇంకా నొచ్చుకున్నారు. " నేను నిన్ను డెబ్భైరెండేళ్ళు గా సాకాను. ఇంకా నువ్వు అసంతృప్తిగానే ఎందుకున్నావు? నువ్వడిగింది నేను ఏది ఇవ్వలేదు? ఇంకా నువ్వు నానుండి దూరంగా పోవాలనే ఎందుకనుకుంటున్నావు? "
" డెబ్భైరెండేళ్ళు గా కోల్పోయిన స్వాతంత్రంలోని ఆనందాన్ని సొంతగా చెట్టుమీద వాలిన ఈ ఒక్క క్షణంలో అనుభవిస్తున్నాను. రాజా, స్వతంత్రప్రేమికి స్వాతంత్ర్యాన్ని మించిన అవసరం వేరే ఏమీ లేదు. ఎన్నేళ్ళైనా సరే, ఆ జీవి స్వాతంత్ర్యంకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది." అని.
నిజమైన స్వాతంత్ర్యంకోసం మనం అందరం ఎదురుచూద్దాం, ఇంకా, ఇంకా.. ఆ పక్షిమాదిరి. మనందరి కలలూ నిజం కాకపోవు, ఏదో ఒకనాటికి.
ఈ ఆగస్టు నెల మనలో నిజమైన స్వాతంత్ర్యపుటాలోచనల్ని రేకెత్తించాలని ఆశిస్తూ-


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, August 10, 2018

పట్టించుకొనే నాధుడెవ్వడూ కనిపించడం లేదుగానీ........


‘ జనాభా లెక్కల్నుంచి.. గణాంక వివరాల వరకూ, నీతి ఆయోగు ఫిగర్లు మొదలు.. వార్షికాంత నివేదికల పిల్లి మొగ్గల దాకా.. ఎప్పుడూ ఏవో తప్పులు.. తికమకలు.. తిరకాసులు! జెమినీ సర్కస్ ఆటల్ను మించిపోతున్నాయీ సర్కారీ నౌకర్ల ఫీట్లు!’ గవర్నమెంటు పన్లు బోలెడు గందరగోళంగా నడుస్తున్నాయి కదా....?.... ఈ మధ్య మరీను
‘ఈ కంప్యూటర్లొచ్చినప్పట్నుంచీ మేటర్ మరీ కాంప్లికేటెడ్ అయిపోయింది! ,అడంగళ్ళు,పట్టాదారు పాసు పుస్తకాలు లాంటి రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే కాదు,ఎమ్ సెట్ పేపర్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, మార్కుల షీట్లు, మార్కెట్ రేట్లు.. గెజిట్లో డేటాఫ్ బర్తుల్లాంటి ఇంపార్టెంట్ మేటర్లో కూడా.. ఎప్పుడూ ఏవో పొరపాట్లు!
జనాలకు అలవాటయింది కాబట్టి పట్టించుకొనే నాధుడెవ్వడూ కనిపించడం లేదుగానీ.. సూపర్ స్టార్స్ సినిమా రిలీజ్ డేట్లూ..కలెక్షన్ రిపోర్టులు , క్రికెట్ హీరోల ట్రాక్ రికార్డులూ.. లాంటివాటిల్లో గానీ తేడాలొస్తే చూడూ! పేడముద్దల్తో చాలా గొడవలయిపోతాయి! ‘
‘పేపర్లో చూసా! ముంబయిలో డబ్బావాలాలు ఎర్ర ఏగానీ ఖర్చు లేకుండా ‘సిగ్మా.. సిక్స్’ స్టాండర్డ్స్ సాధించేసార్ట!
‘సిగ్మా సిక్సా? అంటే?’
‘పది లక్షల పనులు చెస్తే అందులో కేవలం మూడుకి మించి మిస్టేకులు దొర్లకపోవడం! డబ్బావాళ్లు చేసే కోటిన్నర పన్లలో కేవలం ఒక్క పొరపాటే దొర్లుతున్నదని ఆ మధ్య ఇంటర్నేషనల్ మేగ్జైనేదో ఒకటి సర్వే చేసి మరీ సర్టిఫికేటిచ్చింది. చదువూ సంధ్యా లేనోళ్లు ఒక గుంపుగా తయారై కంప్యూర్లకన్నా కరెక్టుగా లక్షలాది భోజనం కారియర్లను వందల కిలోమీటర్ల దూరానున్న శివార్లనుండి సిటీలోకి టయానికి ఠంచనుగా చేరేస్తుంటారని విని అవాక్కయ్యా.
‘మన రాష్ట్రాల్లోకూడా అలాంటి టేలెంటు వున్నవాళ్ళు ఊరికి మినిమమ్ పదిమందుంటారు! ఉదాహరణకి పల్లెల్లో రజకులు ని తీసుకో! ఊరు మొత్తానికి మైలబట్టలు ఉతికే పని. రెండొందల గడప.. గడప గడపకీ పది శాల్తీలు! సగం గడపల్లో సగం మందైనా రోజుకొక్క జత ఉతుక్కి విసిరేసినా.. సుమారు వెయ్యిబట్టల తుక్కు తేలుతుంది ! వీటిలో మళ్లీ ఎన్ని వెరైటీలు! చీరలు.. ధోవతులు.. జాకెట్లు.. ప్యాంట్లు.. అంగీలు.. లుంగీలు! లోపలివి.. బైటివి! లోపాయకారీగా వాడుకొనేవి! చిరిగినవీ.. రంగులు పోయేవీ.. గుండేసి పేల్చినా డాగులు పోనివి! అన్నింటినీ ఇంటిటికీ తిరిగి మూటలు కట్టుకొని రేవులో ఉతికి .. ఆరేసి.. సాయంకాలానికల్లా మల్లెపువ్వులకు మల్లే మార్చేసి.. మళ్లీ ఎవరి తొడుగులు వాళ్లకి ఏ తేడా పాడా రాకుండా.. తడబడకుండా చేరవేస్తున్నారు! ఏళ్ల తరబడి ఏ తప్పులు లేకుండా సేవ చేస్తున్నారు! వాస్తవానికి ఇలాంటి వాళ్ల ‘ఆపరేషన్ వాషింగ్’ ముందర ఈ ‘సిగ్మా సిక్స్’ లెక్కలెన్నైనా బలాదూర్!’

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, August 09, 2018

ఇప్పుడుఅందరికీ తెలిసిపోయింది



           తమ లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి పవిత్ర వ్యవస్థల్ని అడ్డుగా పెట్టుకోవడం మోదీ ప్రభుత్వంచేస్తున్న రక్షణాత్మక వ్యూహం. బ్యాంకుల ముందు ప్రజలు పడుతున్న కష్టాలను ఎవరయినా ప్రస్తావిస్తే సరిహద్దుల్లో మన సైనికులు పడుతున్న కష్టాలకన్నా అవి గొప్పవా అని మోదీ భక్తులు ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి ఎత్తుగడలు ఒకటి రెండుసార్లు బాగానే పనిచేస్తాయి. అతిగావాడితే ప్రజలు ఆ పవిత్రసంస్థల మీద కూడా విమర్శలు కురిపించే ప్రమాదం వుంటుంది.
        పబ్లిక్ డిబేట్ లోనికి న్యాయస్థానాలువచ్చాక జనానికి న్యాయమూర్తుల మీద మునుపటి గౌరవం పోయింది. సైనిక వ్యవస్థ పవిత్రత కూడా ఇప్పుడు ఇలాంటి ముప్పును ఎదుర్కొంటోంది.
          రెండుసంవత్సరాల  క్రితం వరకు రిజర్వుబ్యాంకును చాలామంది ఓ పవిత్ర సంస్థగానే భావించేవారు.పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ రిజర్వ్ బ్యాంకును అడ్డుపెట్టుకోవడం మొదలెట్టింది. ఇప్పుడు రిజర్వు బ్యాంకుపబ్లిక్ డిబేట్ లోనికి వచ్చేసింది. అంబానీ,ఆడానీ,మహేంద్రా వంటి భారీ కార్పొరేట్ సంస్థల మాజీ ఉద్యోగులు,మిలిందా బిల్ గేట్స్ వంటి అంతర్జాతీయ ఆర్ధిక విధాన నిర్ణయ సంస్థల ప్రతినిధులు రిజర్వు బ్యాంకు డైరెక్టర్లుగావుంటారని ఇప్పుడుఅందరికీ తెలిసిపోయింది.
*కేంద్ర ప్రభుత్వం అంటే కార్పొరేట్ల యొక్క,కార్పొరేట్ల ద్వార,కార్పొరేట్ల కొరకు* అనేమాట జనం లోనికి వెళ్ళిపోయింది.
            నల్లధనం కరెన్సీ రూపంలో వుంటుందని ప్రచారం చేయడంలోనే మోదీ అవగాహనలోని డొల్లతనం బయటపడిపోయింది.నల్ల కుబేరులంటే  రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ కంపెనీలు ,ప్రభుత్వకాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, అని చిన్నపిల్లలు కూడా చెపుతారు. వాళ్లంతా నల్ల కుబేరులు కాకపోవచ్చు.....కానీ.... నల్లకుబేరులంతావాళ్ళే. గత రెండుసంవత్సరాల కాలంలో అరెస్టయిన నల్లకుబేరుల్ని వేళ్ళ మీద లెఖ్ఖపెట్టవచ్చు. మరి లక్షల మంది నల్ల కుబేరులు ఏమైపొయారో  మోదీ ప్రభుత్వమే చెప్పాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, August 08, 2018

చేపలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాయి. తిమింగిలాలు బ్యాంకుల్ని దోచుకుంటాయి.


             బ్యాంకులు ఇచ్చే రుణాలకు ఒక ‘సామాజికార్ధిక’ వర్గీకరణ వుంటుంది. బ్యాంకు ఖాతాదారుల్లో మూడు విభాగాలుంటాయి. మొదటిది పేదవర్గాలు. రెండోది మధ్యతరగతి వర్గాలు. మూడోది. వాణిజ్య సంస్థలు కార్పొరేట్లు.
             పేదవర్గాల బ్యాంకు అకౌంట్లు కేవలం లాంఛనమే. గ్యాస్ సబ్సిడీ, వృధ్ధాప్య పెన్షన్ మొదలయిన ప్రభుత్వ సహాయాన్ని పొందడానికే అవి వుంటాయి.
 వాణిజ్య సంస్థలు ,కార్పొరేట్లు ఎప్పుడూ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయవు. అవి భారీ రుణాలను తీసుకుంటాయి.
          ఇక బ్యాంకుల్లో డిపాజిట్లు  చేసేది మధ్యతరగతి వర్గం మాత్రమే. మరో మాటల్లో చెప్పాలంటే చేపలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాయి. తిమింగిలాలు బ్యాంకుల్ని దోచుకుంటాయి.
         బ్యాంకూ రుణాల ఎగవేతదారుల్లో విజయ్ మాల్య పేరు  ఈమధ్య ప్రముఖంగా వినిపిస్తోందిగానీ లక్షల కోట్ల రూపాయల మొండిబకాయిల ఖాతాల్లో అంబానీలు ఆడానీలు కూడా వుంటారు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card