Tuesday, November 07, 2017

ప్రజల్ని భయంకర చీకట్లోకి నెట్టిన జీఎస్‌టీ




ఎంతో ఆడంబరంగా అర్ధరాత్రి ప్రారంభించిన ఆర్థిక దోపిడీ జీయస్టీ(అచ్చం మన స్వతంత్రం మాదిరిగానే).     
           ఇప్పుడు భారతదేశం జీఎస్‌టీ అనే భయంకర రాక్షసి చేతుల్లో నలిగిపోతూ ఉంది. ఆయన తన గుర్రాన్ని శ్రామిక జనం, మధ్య తరగతి మీద పరుగులు తీయిస్తున్నారు. ప్రజల దుఃఖం వర్ణనాతీతం., భారత్‌ను అమెరికా చేయాలని కల... డిజిటల్‌ ఇండియా అంటారు. స్వచ్ఛభారత్‌ అంటారు. జీఎస్‌టీ అంటారు.
      అసలు ఆర్థిక సంస్కరణలు అంటే ప్రధాని మోడీకి తెలుసా? ఆర్థిక సంస్కరణలు అంటే..
చిన్న చిన్న అవసరాలకి బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నవారిని ఆదాయ లెక్కలదడిగి వేధించటమా?
పరిశ్రమాధిపతుల కోటీశ్వరుల పదిలక్షల బ్యాంకు మొండి బకాయిలను దపదఫాలుగా రహస్యంగా మాఫీ చేయటమా? వాళ్ల మొండి బకాల మాఫీకి ప్రజల మీద జీఎస్‌టీ రుద్ది లక్షల కోట్లు వసూలు చేయటమా? ఆర్థిక సంస్కరణలు అంటే ఏమిటీ? శ్రమజీవి కడుపు కొట్టి కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని పెంచటమా? తక్కువ ధర పెట్రోల్‌ను డెబ్బది రూకలకు అమ్మటమా? ఆర్థిక సంస్కరణలంటే.. అన్నదాతల మీద దళారీ నిరంకుశ దోపిడీ పెంచటమా? భారతదేశాన్ని అదానీ, అంబానీ సామ్రాజ్యానికి తాకట్టు పెట్టటమా?
ఏమిటీ ఆర్థిక సంస్కరణలు అంటే..? అడవి దారి తెలియని వ్యక్తి వేటకెళ్లినట్టుగా ఉంది మోడీ పని...

        70శాతం ప్రజలకు ఇంగ్లీషు రాదు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం తెలియదు. నగదు రహిత లావాదేవీలట... అంతటా కుప్పిగంతులే. 'బక్కోడి' కష్టం 'బలిసినోడికి' పెట్టినట్టుగా ఉంది.
        లక్షల సంఖ్యలో చిన్న చిన్న షాపులుంటాయి. లక్షల సంఖ్యలో ప్లాట్‌ ఫాం దుకాణాలు, కిళ్లీ కొట్టులు, నాలుగు చక్రాల వాహన షాపులు, సైకిల్‌ మీద తిరిగి అమ్మేవాళ్లు... వీళ్లు ఏమన్నారయ్యా మోడీజీ... జీఎస్‌టీ పేరుతో వీళ్ల కడుపు కొడుతున్నారు. ఏవో పొట్ట పోసుకొని బతుకుతున్న చిన్న వ్యాపారులు వీళ్లు... జీఎస్‌టీ పేరుతో కేంద్ర ఆదాయ పెంపు దృష్టితో లక్షల సంఖ్యలో ఉన్న వీళ్లపొట్ట కొట్టావు. జీఎస్‌టీని తిట్టుకుంటున్నారు మోడీజీ... పరిశ్రమల పేరుతో పేదల నేలను వాళ్ల దుఃఖం కన్నీళ్లలో దోసిళ్లతో సమర్పిస్తున్నావు కనుక... వాళ్ల నిశ్శబ్ధం భయంకర మార్పుకు సంకేతం
భారతదేశం, జీయస్టీ అనే భయంకర చీకటిలో దారి తెలియక ఊపిరాడక బాధపడుతూ ఉంది.
            'జీఎస్‌టీ' అంటే గూడ్సు అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌' అన్నారు. అంతా వలస భాష. ఏ ప్రజలకూ అర్థంకాని భాష. ఆచరణకు.. పదాలకు ఏమాత్రం సంబంధం లేని భాష. ఎవరిష్టమొచ్చినట్టు వారు వాడుకోవటానికి అనువైన పదాల టాక్స్‌ అది. మామూలు ప్రజలు పోయి ఒక షాపులో ఏదైనా వస్తువు ఖరీదు చేసి ''గతం కంటే ధర ఎందుకు పెరిగింది?'' అంటే జీఎస్‌టీ అంటున్నారు. ఎవరిష్టం వారిది. ఎవరి దోపిడీ వారిది. ''ఒకే పన్ను ఒకే ప్రజ.. ఒకే దేశం'' ఎలా సాధ్యమవుతుందో అర్థం కాదు. వ్యవసాయక దేశంలో, కోట్ల సంఖ్యలో నిరుద్యోగులున్న దేశంలో, లక్షల సంఖ్యలో చిన్న వ్యాపారులున్న దేశంలో, ఒక వస్తువు పది చేతులు మారి పది రూపాయల వస్తువు వంద అయ్యే దేశంలో జీఎస్‌టీ ఎలా అమలు పర్చాలో ఎలా అమలు అవుతుందో ఘనమైన ఏలుతున్న ప్రభువులకు తెలుసా? అసలు ఈ ప్రభువులకు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల ఉత్పత్తులు, వనరులు ఆధారాలు తెలుసా? పాత రైల్వేస్టేషన్‌లు బాగు చేయటం రాదు. బుల్లెట్‌రైలు.. రైలు మార్గం కొరకు వేల కోట్ల ఖర్చు... ఇవీ మోడీ ఊహల పల్లకీల రాజ్యం... పేదలపై బరువు భారం! బుల్లెట్‌ రైలు ఎవరి కోసం?
ఇవ్వాళ్ల భయంకరంగా దేశాన్ని ఊపిరి ఆడకుండా చేసిన జీఎస్‌టీ ఎవరికోసం? ఈ విధాన రూపకల్పనలో నియంతృత్వ భావజాలం ఉంది. తన మాట వేదం... రాష్ట్రాలు తన కాళ్ల కిందపడి ఉండాలి. జీయస్టీతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పూర్తిగా గంగలో కలిసింది.
జీఎస్‌టీ ప్రారంభించి ఎన్ని నెలలయ్యింది? ఈ కొద్ది కాలానికే జీఎస్‌టీలో ఎన్నో మార్పులు. ఇది తగ్గించామంటారు. దీనికి పెంచామంటారు. నిలకడలేని మాటలు. నిండుతనం లేని విధానాలు.. మన దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీకి పల్లెలు తెలుసా? వ్యవసాయం తెలుసా? వ్యవసాయ దేశమని తెలుసా? మనదేశ ప్రధాన ఉత్పత్తి ఏమిటో తెలుసా? వనరులు ఏమిటో తెలుసా? ప్రజల యిబ్బందులు తెలుసా? వాళ్లకు ఏమి అవసరమో తెలుసా? ఈ మూడు నాలుగు నెలల్లో జీఎస్‌టీలో ఎన్ని మార్పులు... చేర్పులు... ఇలా ఉంటుందా పన్నుల విధానం.. జీఎస్‌టీ వలన వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల కొనుగోలుశక్తి నశించింది. ఏ ధర ఎందుకు పెంచుతున్నారో ఎందుకు తగ్గిస్తున్నారో తెలియదు. చిన్న చిన్న వ్యాపారాలు మూసుకొంటున్నారు. డబ్బు లావాదేవీల వ్యాపార సంస్థలు దివాలా తీస్తున్నాయి. చిన్న పరిశ్రమలు మూసివేస్తున్నారు. జీఎస్‌టీ దారిలో ఎటుపోతోంది దేశం!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card