Thursday, June 14, 2018

కవిత్వ శిఖరం అటల్ బిహారీ


కవిత్వ శిఖరం అటల్ బిహారీ


     

కవిత్వం నిరంతరాయంగా రాసే రాజకీయ నాయకులు అతి కొద్దిమందే. రాజకీయంలో తలమునకలై కొద్దిపాటి సమయం కూడా దొరకని ప్రధానమంత్రి పదవి నిర్వర్తిస్తూ కూడా కవిత్వం రాయగలగడం దాదాపు అసాధ్యం. అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి వారికే అది సాధ్యమైంది.
రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వసాధనను విడిచి పెట్టని  గొప్ప కవి అటల్ జీ. ఆయన రచించిన మొదటి కవిత తాజ్ మహల్లో అభ్యుదయ వాదం కనబడుతుంది. వాజ్ పేయి అత్యున్నత శిఖరం అయినా సామాన్యుడి నుండి దూరం కావద్దని కోరుకున్నారు.
హే ప్రభూ!
నాకు ఇంతటి ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు
ఇతరులను గుండెలకు హత్తుకోనంతగా
అంతటి హృదయ కాఠీన్యాన్ని
ఎప్పుడూ నాకు ఇవ్వకు...
ఇంతగా సామాన్యుడితో కలిసిపోవాలని కోరుకునే నాయకుడు ఎవరుంటారు? తనకు శిఖరాలు లభించకపోయినా పర్వాలేదు గానీ ఇతరుల నుండి దూరం చేయొద్దని మనసారా వాంఛ కనబరిచేవారు ఎవరన్నా ఉంటారా? శిఖర స్థాయి వద్దని కోరుకోడానికి కారణం కూడా తనే చెప్పారు వాజ్ పేయి.
ఎత్తయిన పర్వతాలపై
చెట్లు ఎదగవు
మొక్కలు మొలకెత్తవు
గడ్డి పరక కూడా పరచుకోదు
వాజ్ పేయి భావన వెనుక ఉన్న సునిశిత పరిశీలనకి ఉదాహరణ ఇది.  
గాలి గోపురంలా ఒంటరిగా
తనవాళ్లకు దూరంగా
శూన్యంలో ఏకాకిగా మిగిలిపోవడం
పర్వతాల గొప్పదనం కానేకాదు
అది కేవలం నిస్సహాయత
అందుకే ఆ నిస్సహాయత తనకు వద్దని ఆయన కోరుకుంటారు.
రుతువులు ఏవైనా
వసంతం కానీ హేమంతం కానీ
కేవలం ఎత్తుగా ఎదగడమే అయితే
నిశ్శబ్దంగా ఒంటరిగా మిగిలిపోవడమే!
అలా ఒంటరిగా మిగిలిపోయేవాడు సమూహానికి దూరమవుతాడు. అందుకే శిఖరం కావద్దని కోరుకుంటారు వాజ్ పేయి.
ఎమర్జెన్సీలో జైలు పాలైన సందర్భంలో వాజ్ పేయి రాసిన కవితలో
చీకటి రాత్రి
విసిరిన సవాలు ఇది
కిరణమే చివరి అస్త్రమవుతుంది
అంటూ అప్పటి ప్రభుత్వానికి సవాలు విసిరారు.
తలవంచడం
మాకు సమ్మతం కాదు
పందెంలో అన్నీ ఒడ్డి నిలబడ్డాం
నేలకొరుగుతాం కానీ తలవంచం
అంటూ లక్ష్య సాధన పట్ల తనకుండే నిబద్ధతను కవిత్వీకరించారు వాజ్ పేయి.
అదే సందర్భంలో రాసిన మరో కవితలో
జైలులో ఉన్న కవి మనస్సులో ఒక ఆలోచన మెరిసింది
ఏ వ్యక్తి కూడా జీవితంలో నిరాశ చెందరాదని
నిషా వక్ష స్థలాన్ని చీల్చుకొని
మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు!
ఎంతో ఆశావహ దృక్పథాన్ని కనబరిచిన కవిత్వ పాదాలివి. నాటి ఎమర్జెన్సీ రోజుల్లో నిర్బంధంలో ఉంటూ పరిస్థితులు మారతాయని ఆశాభావాన్ని కనబర్చారు వాజ్ పేయి.
ధర్మరాజును కూడా పాప పంకిలం వదిలిపెట్టలేదన్న సూక్ష్మ పరిశీలన వాజ్ పేయిది. అందుకే
ధర్మరాజు కూడా
జూద మోహ క్రీడలని వదులు కోలేదు
అందుకే జూద పంకిలం అంటుకున్నది
ప్రతి న్యాయ పంచాయితీలో
పాంచాలియైనా
నిరుపేద స్త్రీయైనా
అవమానితయే
ఇప్పుడు
కృష్ణుడు లేని
మహాభారతం కావాలి
అంటారు వాజ్ పేయి.
తన కవిత్వం ఓడిపోయిన సైనికుడి నిరాశావాద గుండె చప్పుడు కాదని, విజయం సాధించి తీరతాననే పోరాట యోధుని అచంచల ఆత్మవిశ్వాస దృక్కోణమని పేర్కొంటారు అటల్ జీ. ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకునే న్యాయవాదిగా, మానవతావాదిగా, దేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రేమికుడిగా, ప్రజా శ్రేయస్సు కోరుకునే నాయకుడిగా తన కవిత్వంలో కనబడతారు వాజ్ పేయి.  సూక్ష్మ పరిశీలన, భారతీయ దార్శనికతను ఆధునిక భావనలతో విశ్లేషించడం వాజ్ పేయి కవిత్వంలో కనబడతాయి. వాజ్ పేయి శిఖర స్థాయిని నిరాకరించిన శిఖర సమానుడు.


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Saturday, June 09, 2018

పరమేశా గంగను విడుము పార్వతి చాలున్

ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట.
సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేలు తన పెండ్లాడన్..
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగను విడుము పార్వతి చాలున్..

నీళ్లకోసం ఇలా గడుసుగా విసిరిన చమత్కారానికి ఎంత మాడుపు మొహమైనా వికసించక తప్పదు.
ఆయనదే మరో పద్యం..

Thursday, May 31, 2018

‘సూర్యకాంతం’ సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది

‘సూర్యకాంతం’ సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది
తనముందే కాదు తన తర్వాత కూడా ఎవరు లేకుండా  చేసుకుని ,శిఖరాగ్రాన నిలబడిన ప్రపంచంలోనే ఏకైక సినిమా నటి
 రెండు రోజుల క్రితం ‘గుండమ్మకథ’ సినిమా టీవీ లో చూసాను.సూర్యకాంతం నటన హావభావాలు కోసమే చూసా.సినిమా ఒక వినోద సాధనం. వీరికి చిరంజీవి ఒక్క గుద్దుతో వందమందికి నెత్తురు కక్కిస్తే చూడ్డానికి సర్దాగా ఉంటుంది. ఈ నెత్తురు కక్కుడు నిజజీవితంలో సాధ్యమని అనుకునే అమాయకులెవరూ లేరు.
శాస్త్రీయ సంగీతం నిర్లక్ష్యం చెయ్యబడిందని శంకరశాస్త్రి గొంతు చించుకుని కుంభవృష్టి తెప్పించాడు. సినిమా హాలు బయటకొచ్చిన మరుక్షణం ప్రేక్షక దేవుడు శంకరశాస్త్రి కురిపించిన భోరువర్షాన్ని మర్చిపోయాడు. ఈ శాస్త్రీయ సంగీత గోల చిరంజీవి ఫైటింగులా సినిమా హాలు వరకే పరిమితం. కానీ సూర్యకాంతం పాత్రల ప్రభావం సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది.
అత్తలు ప్రతి ఇంట్లో ఉంటారు. కోడళ్ళు అత్తలో సూర్యకాంతాన్ని దర్శిస్తారు. తలిదండ్రులు కూడా కూతుర్ని కాపురానికి పంపేప్పుడు 'మీ అత్త ముండతో జాగ్రత్త తల్లీ' అని మరీమరీ చెప్పి పంపిస్తారు. ఆ పిల్లకి ఈ హెచ్చరికల్తో టెన్షన్ మరింత పెరుగుతుంది. శత్రుదేశంలోకి అడుగెడుతున్న సిపాయిలా బిక్కుబిక్కున అత్తారింట్లోకి అడుగెడుతుంది.
అత్తకి కూడా కోడలంటే అభద్రత, అనుమానం. 'ఇన్నాళ్ళూ కొడుకు నా సొంతం. ఇవ్వాళ ఈ పిల్లకి కూడా వాటా వచ్చేసింది. నా ప్రాముఖ్యత తగ్గిపోనుందా?' మనసులో బోల్డన్ని సందేహాలు. కోడలి ప్రతి చర్యా నిశితంగా పరిశీలిస్తుంది. కఠినంగానూ ఉంటుంది. తన ప్రవర్తనని జస్టిఫై చేసుకోడానికి సూర్యకాంతాన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటుంది ('నేను' సూర్యకాంతంలా గయ్యాళిని కాదు).
అంటే - అత్తాకోడళ్లిద్దరూ తమకి తెలీకుండానే సూర్యకాంతం ప్రభావానికి లోనవుతున్నారు. తమని తాము స్టీరియో టైప్ చేసుకుని, ఎదుటివారిని కూడా అలానే చూడ్డానికి మైండ్‌ని కండిషన్ చేసుకుంటున్నారు. అందువల్ల ఒకరిపట్ల మరొకరు మనసులో ముందే 'ప్రీ ఫిక్స్' అయిపోయ్యారు. ఇందువల్ల ఇద్దరికీ నష్టమే.

చిన్న ఉదాహరణ. కోడలు ఇల్లు చిమ్ముతుంది. గచ్చుపై ఎక్కడో కొద్దిగా ధూళి ఉండొచ్చు. అది అత్తకి నచ్చదు. చిన్న విషయమే కదాని ఆ పెద్దావిడ ఊరుకోదు. అదేదో పని ఎగ్గొట్టడానికి కోడలు వేస్తున్న ఎత్తుగా భావిస్తుంది. అంచేత కొత్తకోడలుకి పని చేతకాదని తేల్చేస్తుంది. కోడలు ఆ విమర్శని తట్టుకోలేదు (మహామహా రచయితలే విమర్శల్ని తట్టుకోలేరు. ఇంక కోడలు కుంక ఏపాటి!). 'నేను పని బాగానే చేస్తున్నాను. అమ్మ చెప్పినట్లు ఈ ముసల్ది కేవలం తన ఆధిపత్య ప్రదర్శన కోసమే నానా యాగీ చేస్తుంది.' అనుకుని చిటపటలాడిపోతుంది.
నిందితుడికి శిక్ష పడేదాకా నిరపరాధే. మంచిదని నిరూపింపబడేదాకా ఏ అత్తైనా సూర్యకాంతమే. సోషల్ సైకాలజీలో 'ఒబీడియన్స్ కాన్సెప్ట్' అని ఒకటుంది. ఉదాహరణకి జైలు అధికారులు ఖైదీలు తమపట్ల మిక్కిలి వినయంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండకపోతే వారికి కోపం వస్తుంది. అప్పుడు వారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు (అత్యంత క్రూరమైన జైలుహింస గూర్చి కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి ఒక నవల్లో వొళ్ళు గగుర్పాటు కలిగేట్లు వివరంగా రాశాడు). దీన్నే 'ఏక్టింగ్ ఔట్' అంటారు. ఈ విషయాన్ని సోషల్ సైకాలజిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.

వాస్తవానికి జైల్లో శిక్షననుభవించేవారు జైలు అధికారులకి శత్రువులు కారు, అలాగే అత్తాకోడళ్ళు కూడా. వారు మారుతున్న తరాలకి ప్రతీకలైన వేర్వేరు వయసుల స్త్రీలు. ఒకర్నొకరు అనుమానంగా చూసుకోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఐతే సూర్యకాంతం అంటే అర్ధం గయ్యాళి కాదు.తెలుగు వారి అలా అనుమానిస్తున్నారు అంతే . ఖచ్హితంగా అనుమానమే అభిమానం మాత్రం కాదు ఎందుకంటే ఇన్నిరోజుల తర్వాత కూడా తమపిల్లలకి ఆ పేరు(అంత మంచి పేరు) పెట్టటానికి కూడా తెలుగు వారు ఇష్ట పడటలేదు.( లేదా భయపడతున్నారు) కాబట్టి.



------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681







Monday, May 28, 2018

టీవీలో ........




ఇక ఎలాగూ నిద్ర పట్టేలా లేదు అని వార్తలు విశేషాలు తెలుసుకుందామని టీవీ ఆన్ చేశాను.
మీ టీవీ చానెల్‌లో మాలో ఎవరు లూటీశ్వరుడు?” కార్యక్రమం వస్తూంది. కండక్ట్ చేస్తూంది సినీ నటుడు రాగార్జున.
ఇప్పుడు 1000 రూపాయల ప్రశ్న. మగాళ్ళు ఈ కింది దుస్తుల్లో ఏం వేసుకోరు?
1) పంచ 2) ప్యాంట్ 3) లుంగీ 4) చీర
మీ దగ్గర కేవలం ముప్పై సెకండ్ల టైం మాత్రమే ఉంది.అంటున్నాడు రాగార్జున కంటెస్టెంట్‌తో.
చీర,” టక్కున చెప్పింది కంటెస్టెంట్.
అ హ హ! భలే చెప్పారు! అంత వేగంగా ఎలా చెప్పారు? మీకు జెనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువనుకుంటాను. అ హ హ!
నా మొహం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కద! మా ఇంట్లో మగాళ్ళు ఎవరూ చీర కట్టుకోరు.
అ హ హ. పైగా మీకు బోలెడు సెన్స్ అఫ్ హ్యూమర్ కూడా ఉంది. అ హ హ.
నేను చానెల్ మార్చాను.
వీ.సీ.ఆర్ ఆవేశంగా జర్నలిస్టులతో మాట్లాడుతున్నాడు. ఎంత భయం లేకుంటె మా ఎం.ఎల్.ఏ.లవి పాచి కల్లు తాగిన మొహాలంటరు? ఎం.ఎల్.ఏ.లే కాదు మా పార్టీల సన్నాసులు కూడా నిఖార్సైన కల్లే తాగుతరు. సాయంత్రం మా పార్టీ ఆఫీస్‌కి వస్తే వాళ్ళకే తెలుస్తుంది.
ఐనా మా ఎం.ఎల్.ఏ.లు సార్వభౌమాధికారంఅనే పదాన్ని సక్కగా పలకలేదు. గంతే కద. ఈ పెద్ద పెద్ద పనికిమాలిన పదాలు మాకు అవసరం లేదు. ఇప్పటి సందిసార్వభౌమాధికారంబదులు పెద్ద పెత్తనంఅని చెప్తం. ఖేల్ ఖతం. దుకునం బంద్!
మళ్ళీ చానెల్ మార్చాను.
డ్యాన్స్ వాజా డ్యాన్స్ప్రోగ్రాం వస్తుంది. ఒక జంట అప్పుడే తమ పెర్‌ఫార్మెన్స్ ముగించినట్టున్నారు. ముగ్గురు జడ్జెస్ ముందు నిలబడ్డారు. ఒక జడ్జ్ వాళ్ళని కూకలేస్తున్నాడు.
సారీ మీకు 5 కంటే ఎక్కువ పాయింట్లు ఇవ్వలేను. విజయమాలిని పాటకు అంత మర్యాదగా డ్యాన్స్ చేస్తారా? ఆ ఊపు ఏదీ? ఆ కులుకులు ఏవీ? ఇదేమన్న ఫ్యామిలీ అంతా చూసే ప్రోగ్రాం అనుకున్నారా?”
ఆ జంట సారీ మాస్టార్!అని ఘొల్లుమన్నారు.
చానెల్ చేంజ్ చేశాను.
గంగమ్మ గారి గౌడి గేదెసీరియల్ వస్తూంది. ఒక మోతుబరి ఆడ లేడీ పశువుల కొట్టంలో కూర్చుని తన గేదెలను శుభ్రంగా తోముతూంది.
అదేంటి గంగమ్మ గారూ, ఇంత మంది ఉండగా మీరు చేయి చేసుకుంటున్నారు? కోట్లకు అధిపతి అయిన మీరు ఇలా బర్రెలని బరా బరా తోమేస్తూ ఉంటే చూడలేకపోతున్నానమ్మా,” మొర పెట్టుకుంటున్నాడు ఒక పాలేరు.
మనం ఎప్పుడు మన మూలాల్ని మరిచిపోకూడదురా. ఈ గేదెల వల్లే, నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. కనీసం ఇవి కంపు కొట్టకుండా చూసుకోవడం నా ధర్మం రా, నా ధర్మం!ఆవేశంగా అంటూంది గంగమ్మ.
మెల్లగా తల నొప్పి స్టార్ట్ అయ్యింది నాకు. అసలు ఒక్క మంచి ప్రోగ్రాం కూడా రాదా ఈ టీవీలో?
భయపడుతూనే ఒక న్యూస్ చానెల్ పెట్టాను.
ప్రధాన మంత్రి సురేంద్ర మోడీ ప్రస్తుతం భీటాన్ పర్యటనలో ఉన్నారు.
ఎంత మంచి వార్త! నైచా, డిబెట్‌ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాక, పర్వత సానువులను అంటపెట్టుకుని ఉన్న ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. దాని ఫలితంగా రవాణా వంటి వ్యవస్థలు కూడా వెనకపడ్డాయి. చాలా చోట్ల బార్డర్ చేరుకోవాలంటే రోజుల తరబడి కాలి నడకన వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక వైపు నైచా తమ దేశంలో, బార్డర్ పొడుగునా రైలు పట్టాలు, రోడ్లూ నిర్మిస్తూ తమ సరిహద్దులని మరింత పటిష్టం చేసుకుంటూంది. వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే జంబూ ద్వీపం, భీటాన్ కలిసి పని చేయడం ఎంతైన అవసరం.
నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ మా ఆవిడ గొంతు వినిపించింది, “ఈ సురేంద్ర మోడీకి పని పాటా లేదనుకుంటాను. ఆ దిక్కు మాలిన భీటాన్‌కి ఎందుకు వెళ్ళడం? సోది ఆపి, గంగమ్మ గారి గౌడి గేదె సీరియల్ పెట్టండి,” అంటూ.
నేనూ అప్రయత్నంగా నిట్టూర్చాను.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Address for Communication

Address card