Friday, June 28, 2019

మానసిక దిగంబరత్వం కోసం



కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం ఏమంత సులువు కాదు. మనసులో ఎగసిపడిన భావాలను చరణబద్ధంగా అక్షరాలలోని ఒంపే ప్రక్రియ అనుకోవచ్చునేమో! కాకపోతే రానురానూ మనసులో మెదిలిన ప్రతి ఒక్క భావాన్నీ ఏదో ఒకలా వదిలించుకుని, దానినే కవిత అని పేరు పెట్టుకునే పరిస్థితులు వచ్చేశాయి. తెలుగునాట కవిత్వం చదివేవారి సంగతేమో కానీ, కవుల సంఖ్య మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. సామాజికమాధ్యమాల ద్వారానో, చిన్నాచితకా సభల ద్వారానో ఉబికివస్తున్న స్వయంప్రకటిత కవుల తాకిడి ఎక్కువైపోయింది. కవిత్వంలో నిబద్ధత గురించి ఇలాంటివారికి ఓసారి గుర్తుచేయాలంటే దిగంబర కవులను తల్చుకోవాల్సిందే!

1960వ దశకంలో ఉవ్వెత్తున దూసుకువచ్చి ఇదిదిగంబరరశకం, నగ్ననామ సంవత్సరం, ఆశ రుతువుఅని సగర్వంగా చాటిన దిగంబర కవుల గురించి చెప్పుకొనేందుకు చాలానే ఉంది. నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య, మహాస్వప్న
 అనే ఆరుగురు కవులే మనం తల్చుకున్న దిగంబర కవులు. వీరి అసలు పేర్లు ఇవి కావు.
సొంత పేర్లతో రాయకూడదనేది ఈ ఉద్యమంలో ఒక షరతు. ఆ మేరకు కమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మహాస్వప్న కలం పేరు ధరించారు. మిగతావారిలో భాస్కరరెడ్డి చెరబండరాజుగా, కేశవరావు నగ్నమునిగా, వీరరాఘవాచార్యులు జ్వాలాముఖిగా, మన్మోహన్‌ సహాయ్‌ భైరవయ్యగా, యాదవరెడ్డి నిఖిలేశ్వర్‌గా కలాల పేర్లు పెట్టుకొన్నారు. మానసిక దిగంబరత్వం కోసం నిత్య సచేతన ఆత్మస్ఫూర్తితో జీవించడమే మా ఆశయం. శ్వాసించే ప్రతి వ్యక్తితో సారూప్యం చెంది, వ్యక్తి అస్థిత్వ పరిరక్షణ కోసం, అంతరంగంలో అణగిపడి ఉన్న ఆరాటాన్ని, ఆ సంతోషాన్ని, విసుగును, అక్షరాల్లో వ్యక్తీకరించి నూతన విశ్వాసాన్ని, ఆశను కలిగించాలని మా తత్పరత’’ అంటూ వారు సంకల్పం చెప్పుకొన్నారు.

ఈ ఆరుగురూ కూడా తమతమ లక్ష్యలకు ప్రతీకగా ఉండేందుకు నియమించుకున్న కలం పేర్లే కానీ కులం పేర్లు కావు. నిజానికి ఈ ఆరుగురూ అప్పటికే కవితాలోకంలో ఎంతో కొంత పేరు తెచ్చుకున్నవారు. అయితే నిస్తబ్దుగా ఉన్న కవితాలోకంలో ఏదో ఒక ప్రకంపన సృష్టించాలన్న తపనతో ఒక చోటకి చేరారు. అందుకోసం వారు uncensored గా తమ భావాలను వెలిబుచ్చుతూ మూడు సంకలనాలను తీసుకువచ్చారు.

తెలుగు కవిత్వాన్ని శాసించిన దిగంబర ఉద్యమ కవుల్లో ఒకరు, ప్రముఖ సాహితీవేత్త మహాస్వప్న (79) కన్నుమూశారు. నేను వస్తున్నాను దిగంబరకవినిఅంటూ దిగంబర కవిత్వోద్యమానికి శంఖారావం పూరించిన వారు మహాస్వప్న. కాలం వాయులీనం మీద కమానునై, చరిత్ర నిద్రాసముద్రం మీద తుఫానునైఅంటూ తన అద్భుత కవితాశక్తితో ఒక తరాన్ని ఆయన కదిలించారు మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు.. వృతిరీత్యా వ్యవసాయదారుడు. ఆజన్మ బ్రహ్మచారిగానే జీవితాంతం గడిపారు.
ఆత్మయోని
నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే
నిద్రపోనియ్యి
లేపకు
పీకనులిమి గోతిలోకి లాగుతాడు.
ప్రబంధాంగనల తొడలు తాడి మొద్దులు
తాకితే కాళ్ళు విరగ్గొట్టు
అంటూ సాగే కవిత్వంలో తమ ఉద్దేశం ఏమిటో కుండబద్దలుకొట్టేశారు దిగంబర కవులు.
దిగంబర కవిత్వం ఊహించినట్లుగానే ప్రకంపనలు సృష్టించింది. రా.రా, తిలక్, సోమసుందర్‌ వంటి ప్రఖ్యాతులు ఈ కవిత్వంలోని పదప్రయోగాలను నిరసించారు. ఇందులోని లైంగిక ప్రతీకలని, అశ్లీల పదాలనీ ఎండగట్టారు. కానీ శ్రీశ్రీ, చలం వంటి రచయితలు ఈ రచనలను నెత్తికెత్తుకున్నారు. ఉడుకురక్తపు యువకులు పదేపదే ఈ కవితలను చదువుకున్నారు. అణగారిన వర్గాలు దిగంబర కవిత్వాన్ని గుండెలకు హత్తుకున్నారు.
ఈ దేశంలో, ఈ గోళంలో ఊపిరిపీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపనపడి, అతడి భావిని చూసి వెక్కి వెక్కి, పిచ్చెక్కి ప్రవచించిన కవితఅంటూ తమ కవితలను నిర్వచించారు. వారి కవిత్వం చదివితే అదెంత నిజమో అర్థమవుతుంది.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card