Wednesday, January 14, 2015

మసీదులో వేదమంత్రం

మసీదులో వేదమంత్రం!!
కల కాదు నిజం. ఊహ కాదు - వాస్తవం.
అయితే కావొచ్చు. అది మారుమూల, ఊరవతల - మనుషులెవరూ లేని ఏ పాడుబడ్డ మసీదులోనో అయి వుంటుంది - అనుకుంటున్నారా?
కాదు. అది జరిగింది దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో. అందునా - సుప్రసిద్ధమైన జుమ్మా మసీదులో. అది కూడా శుక్రవారం ప్రార్థన సమయాన వేల మంది మహమ్మదీయుల సమక్షంలో!

ఓహో! అయితే - నమాజు వేళ ఏ హిందూ మతోన్మాదో చొరబడి, ముస్లింలను రెచ్చగొట్టటానికి మంత్రాలు వినిపించాడేమో...!?
వినిపించినవాడు హిందువే. పైగా కాషాయం కట్టిన స్వామి. కాని దొంగతనంగా చొరబడలేదు. ముసల్మాన్లను రెచ్చగొట్టటానికి ఆ పని చేయలేదు. ముస్లిం నాయకులే, మహమ్మదీయ మతం పెద్దలే పట్టుబట్టి ఆయనను అక్కడికి ప్రత్యేకంగా పిలిపించారు. సందేశం ఇమ్మని సాదరంగా కోరారు. ఆయన పలికింది శ్రద్ధగా విన్నారు. మెచ్చుకున్నారు.
ఇది జరిగింది 1919 సంవత్సరం ఏప్రిల్ 4న.
ఆ స్వామి పేరు శ్రద్ధానంద సరస్వతి.
ఇస్లాం తప్ప వేరొక మతాన్ని మహమ్మదీయులు గుర్తించరు. అందునా ఒక ప్రవక్తగాని, ఒక పవిత్ర గ్రంథంగాని లేకుండా విగ్రహాలను ఆరాధించే హిందువులతో మతపరంగా, తాత్వికంగా వారికి ప్రాథమికమైన విభేదాలు ఉన్నాయి. హిందువులతో కలిసిమెలిసి సామరస్యంగా సహజీవనం చేయాలని కోరే మహమ్మదీయులు కూడా హిందూ పెద్దలను తమ పవిత్ర ప్రార్థనా స్థలంలోకి ఆహ్వానించి (వారు ఎంతటి మహాత్ములైనా సరే), వారి చేత సందేశం ఇప్పించాలని కోరుకోరు. అలాంటిది - అత్యంత ప్రధానమైన మసీదులో వేలాది ముసల్మాన్లను ఉద్దేశించి ఒక హిందూ మతాచార్యుడు ప్రసంగించటం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని అపురూప ఘట్టం. ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే అది అపూర్వం.
‘హిందూ-ముస్లిం ఐక్యత స్వరాజ్యం కంటే గొప్పది; ఆ ఐక్యత లేనప్పుడు స్వాతంత్య్రం కూడా నాకు అక్కర్లేదు’ అని పదేపదే చాటి, ముస్లింల సుహృద్భావం కోసం ఎంత దూరమైనా వెళ్లి దేనికైనా తెగించిన మహాత్మాగాంధిని కూడా తమ మసీదులో అడుగుపెట్టమని మహమ్మదీయులు ఏనాడూ కోరలేదు. అంతటి మహాత్ముడికే చిక్కని ఆ అవకాశం శ్రద్ధానంద సన్యాసికి ఎలా దక్కింది? యథార్థంగా జరిగిందేమిటో నేరుగా స్వామి శ్రద్ధానంద మాటల్లోనే వివరంగా వినండి:

ఏప్రిల్ 4 ఢిల్లీ చరిత్రలో రెడ్ లెటర్ డే! విచ్చలవిడి కాల్పుల తరవాత వచ్చిన మొదటి శుక్రవారం అది. ది గ్రేట్ జుమ్మా మసీదులో మృతవీరులకు ఆత్మశాంతిని కోరుతూ సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి.
మామూలు ప్రకారం నేను నగరంలో తిరుగుతున్నాను. ‘హిందువులు కూడా మసీదుకు వచ్చి సంస్మరణ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ముసల్మాన్ సోదరులు పట్టుబడుతున్నారు. మనం ఏమి చెయ్యాలి’ అని చాలామంది పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చి అడిగారు. వాళ్లకు సందేహం ఎందుకు వచ్చిందంటే - మేనేజింగు కమిటీ అనుమతి లేకుండా మసీదులోకి ప్రవేశించే హక్కు ముస్లింలు కానివారికి ఉండదు. మరీ ముఖ్యంగా నమాజు సమయంలో. నేను వాళ్లను కాసేపు ఆగమని చెప్పి దగ్గర్లోనే ఉన్న అబ్దుల్ రహమాన్ వకీల్ ఆఫీసుకు వెళ్లాను. హకీం సాహెబ్‌ను సంప్రదించకుండా మసీదుకు వెళ్లవద్దని రహమాన్‌గారు సలహా ఇచ్చారు. హకీం సాహెబ్ ఇంట్లో లేరు. దాంతో నేను నా ఆశ్రమానికి తిరిగొచ్చాను. నమాజు ముగిసేదాకా వెళ్లకూడదనే నేను నిశ్చయించాను.
నేను ఏదో రాసుకుంటూండగా మధ్యాహ్నం 1 గంటకి దాదాపు యాభై మంది ముసల్మాన్లు నా నివాసం మెట్లెక్కి వచ్చి, ప్రేమపూర్వకంగా బలవంతపెట్టి బయటికి తీసుకెళ్లారు. టాంగాలోకి ఎక్కించారు. కొంతదూరం వెళ్లాక దానికంటే వేగంగా వెళ్లే వాహనంలోకి.. అలా వాహనాలు మారుస్తూ చివరికి మోటారుకారు ఖాళీగా దొరికితే అందులోకి ఎక్కించి హుటాహుటిన తీసుకువెళ్లారు. జుమ్మామసీదు చేరగానే తొందరబెట్టి, దక్షిణం వైపు మెట్ల దగ్గరికి పరిగెత్తించారు. ‘మహాత్మాగాంధీకీ జై’ ‘హిందూ - ముసల్మాన్‌కీ జై’ అన్న కేకల మధ్య నేను మెట్లెక్కాను.
లోపల గుమికూడినవారు 30 వేలకు తక్కువ ఉండరు. నేను చివరి వరసలో కూచోబోతూండగా ముసల్మాన్ సోదరులు పరిగెత్తుకుంటూ వచ్చి లోపలి భవనాల గుండా బయటికి వెళ్లి... మత బోధకుడి (పేష్ ఇమాం) ముందు ఆసా బల్ల (pulpit) అమర్చిన చోటికి తీసుకెళ్లారు. వౌల్వీ అబ్దుల్ మజీద్ జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. నన్ను గమనించి ఆగాడు. నేను సందేహించాను. పైకి వెళ్లమని వందల మంది అరిచారు. రెండు మెట్లు ఎక్కాక నేను మళ్లీ తటపటాయించాను. జన సమూహం ఒక్క ఉదటున లేచి ‘పైకి వెళ్లండి వెళ్లండి’ అని కేకలు పెట్టారు. నేను బల్ల దగ్గరికి చేరాక వారు కూర్చున్నారు.
వౌల్వీ అబ్దుల్ మజీద్ తన ప్రవచనాన్ని కొనసాగిస్తారని నేను అనుకున్నాను. కాని ఆయన ‘అమరవీరుల రక్తం గురించి పవిత్ర ఖురాన్ ఏమనేదీ మీరు ఇప్పటిదాకా విన్నారు. ఇదే విషయాన్ని మన హిందూ సోదరుల పవిత్ర గ్రంథమైన వేదం కూడా ఎలా ప్రబోధిస్తుందన్నది స్వామి శ్రద్ధానంద మీకు ఇప్పుడు చెబుతారు’ అని పలికి ప్రసంగం ముగించారు. హఠాత్తుగా నేను మాట్లాడవలసి వచ్చింది.
త్వంహి నః పితా వసో త్వం మాతా శతక్రతో బభూవిథః
అధాతే సమ్నమీమహే
నీవే తల్లివి; తండ్రివి; మా అందరికీ నీవే శరణు... అంటూ భగవంతుడిని ప్రస్తుతించే ఋగ్వేద మంత్రంతో నేను ప్రారంభించాను. మృతవీరుల నిష్కళంక బలిదానాన్ని ప్రస్తావించి, హిందూ - ముస్లిం సంఘీభావాన్ని ఉగ్గడించే ఈ కవితను వినిపించాను:
‘హిందూ నే సనమ్ మే జల్వా పాయా తేరా
ఆతిష్ పాయి ఫిగాన్ నే రాస్ గయా తేరా
దేహ్రీ నే కియా దెహ్ సే తబీర్ తుఝే
ఇన్‌కార్ కిసీ సే బన్‌నా ఆయా తేరా’
ఆ సమయాన అక్కడ ఉన్నవారు నాటి సన్నివేశాన్ని చక్కగా వర్ణించగలరు. చివరలో నేను మూడుసార్లు ‘ఓం శాంతి’, ‘ఆమీన్’ అని ఉచ్చరించగానే మొత్తం జనమంతా నాతో గొంతు కలిపారు. అది ఉత్తేజకరమైన దృశ్యం. నేను కిందికి దిగి నిష్క్రమిస్తుండగా ప్రజలు మెచ్చుకోలుగా చూశారు.
లోపల ఈ సుందర సన్నివేశం నడుస్తూండగా మసీదు వెలుపల మిలిటరీ, పోలీసులు సాయుధ శకటాలతో మోహరించి ఉన్నారు. నాయకులు ఉద్బోధించిన ప్రకారం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు.
[Inside Congress, Swami Shraddhananda, pp.68-70]

ఈ కాలంలో చాలామంథికి ఇది సహజంగానే నమ్మబుద్ధి కాదు. ఔనుమరి. హిందువులు, ముస్లింలు పరస్పర శత్రువులనీ... ఏ మాత్రం సందు దొరికినా హిందూ మతోన్మాదులు అమాయక ముస్లింలను ఊచకోత కోస్తారనీ... వారి బారి నుంచి మైనారిటీలను రక్షించటానికే సెక్యులర్ నేతాశ్రీలు స్పెషల్ డ్యూటీ మీద భూమిపై అవతరించారనీ... అమాంబాపతు రాజకీయ నాయకులు అనేక దశాబ్దాలుగా నూరిపోశారాయె! హిందువులు, ముసల్మాన్లు ఒకచోట గుంపుగా తారసపడ్డారంటే తలలు పగిలాయనే, గొంతులు కోసుకుంటారనే మనకు లెక్క! అలాంటి ఘోరాలేవీ జరగకుండా రెండు వైరి వర్గాలనూ అదుపులో ఉంచి, శాంతి భద్రతలు కాపాడటానికే పోలీసులు, పారా మిలిటరీ బలగాలు కళ్లలో వొత్తులు వేసుకుని కాపలా కాస్తుంటారని అనుకుంటాం.
అలాంటిది దేశంలోకెల్లా పేరుమోసిన జామా మసీదులో హిందువులు, ముస్లింలు కలిసి ప్రార్థనలు చేయడమేమిటి? కాషాయం కట్టిన హిందూ సన్యాసి వారికి హితబోధ కావించడమేమిటి? మసీదు లోపల హిందూ - ముస్లిం జనాలుంటే వెలుపల పోలీసు, మిలిటరీ సాయుధ శకటాలు బారులు తీరడమేమిటి? తుపాకులు, శతఘ్నలు నోళ్లు తెరిచి చూస్తూంటే ఇరు మతాల ప్రజలు ప్రశాంతంగా నిష్క్రమించడమేమిటి? దీనికి మించిన అద్భుతం ఇంకేముంటుంది?
కాని చరిత్ర పుస్తకాల్లో కాని... మత సామరస్యం కోసమే, హిందూ ముస్లిం సఖ్యత కోసమే ఊపిరి పీలుస్తున్నామని చెప్పే ‘సెక్యులర్’ నాయకమ్మన్యుల మాటల్లో కాని దీని ఊసే వినపడదేమి? ఎవరూ పట్టించుకోలేదంటే నిజానికి ఇది జరగలేదేమో!? అలా శంకించడానికీ వీలు లేదు. హిందూ పక్షపాతి అని ఎవరూ నింద వెయ్యలేని... జవహర్లాల్ నెహ్రుగారే తన ఆత్మకథలో ఈ అపూర్వ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు ఇలా:

Swami Shraddhanand, an Arya Samajist leader had stood in the pulpit of the great Jame Masjid of Delhi and preached to a mighty gathering of Muslims and Hindus of unity and India's freedom. And that great multitude had greeted him with loud cries of Hindu - Musalman - ki - jai, and outside in the streets they had jointly sealed that cry with their blood.
[An Autobiography, Jawaharlal Nehru, P160]

(ఆర్య సమాజ్ నాయకుఢు స్వామి శ్రథ్ధానంద ఢిల్లీలో ది గ్రేట్ జామే మసీదులో బోధకుడి వేదికపై నిలబడి ముస్లింలు, హిందువులు కూడిన మహా జనసమూహానికి ఐక్యత గురించి, భారత స్వరాజ్యం గురించి ప్రబోధించాడు. ‘హిందూ-ముసల్మాన్‌కీ జై’ అని జనబాహుళ్యం బిగ్గరగా కేకలు వేశారు. బయట, వీధుల్లోనూ హిందువులు, ముస్లింలు కలిసి ఆ నినాదాన్ని తమ రక్తంతో సీలు చేశారు.) *
From:andhra bhoomi sunday book-(30/11/2014- ఎం.వి.ఆర్.శాస్త్రి)

No comments:

Post a Comment

Address for Communication

Address card